- సంక్షేమ పథకాలు ఇంటింటికి ప్రచారం చేయాలి
- మంచుకొండ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లాకు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం సాయంత్రం మంచుకొండ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలు ఈ జిల్లాలో ఉండేవి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాకు పరిశ్రమలు లేకుండా పోయాయి. పరిశ్రమలన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి అని తెలిపారు. ఖమ్మం జిల్లా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడే పరిస్థితి ఉందన్నారు. ఫలితంగా ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా యువతకు ఉపాధి కల్పించేందుకు ఇండస్ట్రియల్ పార్కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ డబ్బుతో ఎక్కువ ఎకరాలకు నీళ్లు ఇచ్చే మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసుకోవడం జిల్లాకు గర్వకారణమన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వము చేయలేని పనిని ఇందిరమ్మ ప్రభుత్వం చేసింది అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని పదిలక్షలకు పెంచడం, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు, 22 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం అన్నారు. ఇవే కాకుండా ఈ పండుగ సందర్భంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నమని ప్రకటించారు. ఎన్నికల ముందు చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా అమలు చేస్తున్నామని వీటన్నిటిని కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి తీసుకువెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీయం భట్టివిక్రమార్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.