- బీఆర్ఎస్ చేసిన పర్సంటేజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ భట్టి విక్రమార్క
- బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్… పర్సెంటేజ్ ప్రభుత్వం వద్దంటూ నినాదాలు
శాసనసభలో మాట్లాడేటప్పుడు నిబద్దతతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కబీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డిని హెచ్చరించారు. బుధవారం నాటి శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు పర్సంటేజీల ప్రభుత్వం అని చేసిన ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి తిప్పికొట్టారు. ప్రభుత్వంలో ఎవరు, ఎప్పుడు పర్సంటేజీలు తీసుకున్నారో దమ్ముంటే నిరూపించాలని ఉపముఖ్యమంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు కేటీఆర్కి సవాల్ విసిరారు. నిరూపించకపోతే శాసనసభకు, రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంపై పడి పదేళ్ల పాటు అడ్డగోలుగా దోచుకున్నది మీరే అని బీఆర్ఎస్ సభ్యులపై భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు. ఎన్నో పోరాటాల ద్వారా తెచ్చుకున్న భూ చట్టాలను ఒక్క కలం పోటుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగు చేసిందని విమర్శించారు. పట్టాదారు కాలం పెట్టి సాగు కాలం ఎత్తివేసి దుర్మార్గమైన ధరని చట్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నా సాయుధ రైతాంగా పోరాట స్పూర్తితో దున్నేవారికే భూమి హక్కులు కల్పించాయని ఉప ముఖ్యమంత్రి బుధవారం జరిగిన శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులను కడిగిపాడేశారు.
బీఆర్ఎస్ నిరసన
అంతకుముందు సభలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత కేటీఆర్ మాట్లాడుతూ సచివాలయంలో కమీషన్ల విషయంలో కాంట్రాక్టర్ల ధర్నా గురించి సభలో ప్రస్తావించారు. దీనికి స్పందించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒళ్ళు బలిసి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో పట్టుబట్టారు. ఈ విషయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోడంతో సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. భట్టి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇది పర్సంటేజీల పాలన… వద్దురా నాయనా ఇరవై శాతం పాలన అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు.