ఆపరేషన్ సింధూర్ నాయికలు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్
జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్ధల ప్రోద్బలంతో పెహల్గామ్ దాడి జరిగిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. గత ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం వేకువ జామున భారత వైమానిక దళం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్ధావరాలపై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు సోదహరణంగా వివరించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తోందని, ఈ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉందని, దాని అనుబంధ సంస్ధ టీఆర్ఎఫ్ ఈ దాడికి పూనుకుందని విక్రమ్ మిస్రీ వివరించారు. పహల్గాం దాడి తమ పనే అని స్వయంగా టీఆర్ఎఫ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుందని ఆయన గుర్తు చేశారు. చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని, ఈ ఉగ్రదాడుల వెనుక కూడా పాకిస్తాన్ ఉన్నందునే ఆ దేశంపై దౌత్య, వాణిజ్య పరమైన ఆంక్షలు విధించామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తేల్చి చెప్పారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన లెఫ్ట్నెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ , వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు మాట్లాడుతూ దాడులు ఎక్కడెక్కడ చేసిందీ వివరించారు. నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్ లోని లష్కరే తోయిబా క్యాంపుపై తొలి దాడి చేసినట్లు ఆమె ప్రకటించారు. అలాగే ఎల్ఓసీలో లష్కరే తోయిబా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బింబిల్ క్యాంపుపై దాడి చేసినట్లు చెప్పారు. ఎల్ఓసీకి 8 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ లో ఉన్న సర్జల్ క్యాపుంను తుదముట్టించినట్లు తెలిపారు. ముంబయ్ పేలుళ్ళలో పాల్గొన్న కసబ్ శిక్షణ పొందిన శిబిరం ముర్కిదే క్యాంపు పై కూడా దాడి చేసి నేలమట్టం చేసినట్లు లెఫ్ట్నెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు.