– 2028నాటికి పోలవరం నీళ్లు… ఏపీలో ప్రవహిస్తాయని హామీ
– ఏపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన కేంద్ర హోంమంత్రి
ఏపీని అన్నివిధాలుగా ఆదుకునేందుకు మేమున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. విజయవాడ సమీపంలోని కృష్ణా జిల్లా కొండపావులూరులో జరిగిన ఏపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా మంత్రులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ , ఎన్ఐడీఎం సౌత్ క్యాంపస్ భవనాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనూహ్య విజయం అందించిన అందరికి ధన్యవాదాలు అని తెలిపారు.
ప్రధాని మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని మూడింతలు అభివృద్ది చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వీటన్నింటిని చంద్రబాబుతో కలిసి ముందుకు తీసుకువెళతామని అన్నారు. ఆరునెలల్లో రూ.3 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాం. ఇక 2028లోపు పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయని సభికుల చప్పట్ల మధ్య తెలిపారు.
పోలవరం, రాజధాని నిర్మాణం, టిడ్కో ఇళ్ల నిర్మాణం ఇలా అన్నీ విధాలుగా రాష్ట్రాన్ని వైసీపీ అధోగతి పాలు చేసిందని జగన్ పాలనను విమర్శించారు. తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం పూర్తి చేస్తామని, విజన్ 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే నెంబర్ వన్ చేస్తామని అన్నారు.
అనంతరం డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు , ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించినందుకు, బల్క్ డ్రగ్ పార్క్ ఇలా అడిగిందే తడవుగా కేంద్రం నుంచి అన్నీ ఇస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు