ఇబ్బందులు ఎల్లకాలం ఉండవని… మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని అప్పటి వరకూ ఓపికతో ఉండాలని కడప జిల్లా వైఎస్సార్సీపీ నాయకుల భేటీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల పాటు పులివెందుల పర్యటనలో ఉన్న జగన్మోహనరెడ్డి కడప కార్పొరేషన్ సభ్యులు ఇతర నాయకులతో సమావేశం అయ్యారు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాలను అమ్ముకోకూడదని అందరం కలసికట్టుగా పనిచేస్తే మంచి రోజులు వస్తాయని జగన్ చెప్పారు. రెండేళ్ళలో జమిలి ఎన్నికలు అంటున్నారని… చంద్రబాబులో రోజు రోజుకీ భయం పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి గురించే మాట్లాడటం లేదన్నారు. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నామని వచ్చేది మన ప్రభుత్వమే అని వైసీపీ నేతలకు జగన్ భరోసా ఇచ్చారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఇబ్బందులు పెట్టినా ఓపికతో ఉండండి, మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరచిపోనని చెప్పారు. చంద్రబాబు బాదుడే బాదుడులా పాలన చేస్తున్నారని ఈ దశలో మనం ప్రజాపక్షాన గళమెత్తి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్ధాయిలో పార్టీ నుంచి వివిధ అంశాలపై ఆందోళనలు నిర్వహిస్తున్నామని ఇటీవలే రైతుల కోసం ధర్నా చేశామని, 27వ తేదీ కరెంటు బిల్లులపై నిరసన కార్యక్రమం చేయబోతున్నామని తెలిపారు. అలాగే నూతన సంవత్సంలో జనవరి 3వ తేదీన ఫీజు రీయంబర్స్ మెంట్ పై నిరసన కార్యక్రమం చేయనున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ పాల్గొనాలని జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు.
- Advertisement with us -