కృష్ణా జలాలపై కేంద్రం ఏం తేలుస్తుంది?
ఈనెల 7వ తేదీపైనే రెండు రాష్ట్రాల దృష్టి
దశాబ్దాలుగా సాగుతున్న కృష్ణా జలాల వివాదం ఇప్పుడు అత్యంత కీలక మలుపుకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సాగునీటి వివాదం ఇక తుది పరిష్కార దశకు చేరినట్లు కనిపిస్తోంది. కేంద్ర జలశక్తి వనరుల శాఖ ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహిస్తోన్న కీలక సమావేశం ఈ సుదీర్ఘ వివాదానికి ముగింపు పలికే సంకేతాలు ఇస్తోంది. కృష్ణా నదీ జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఆ సమావేశంతో ఫుల్స్టాప్ పడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
కృష్ణా నది బేసిన్లో మొత్తం 2,578 టీఎంసీల నీటి లభ్యత ఉందని బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్-2 తేల్చింది. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,005 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించబడ్డాయి. అయితే, ఈ కేటాయింపులు *65 శాతం నీటి లభ్యత ఆధారంగా జరిగాయని పేర్కొనడంతో, దీని వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అప్పటి ఉమ్మడి ఏపీ తీవ్రంగా వ్యతిరేకించింది.
రాష్ట్ర విభజన అనంతరం, ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీల నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పంపిణీ చేయాల్సి వచ్చింది. కానీ, ఇక్కడే వివాదం ముదిరింది. ముఖ్యంగా కృష్ణా నది మీద ఆధారపడే అభివృద్ధి, నీటి అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం తన భాగం ఎక్కువగా ఉండాలని వాదిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే సాగు మరియు తాగునీటి అవసరాలకు తగినన్ని వనరులు లేవని, తాము వాటాన్ని తగ్గించుకోలేమని బలంగా అభ్యంతరం చెబుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేరుగా రెండు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించేందుకు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ సమావేశంలో ఏకాభిప్రాయం ఏర్పడితే, దీర్ఘకాలంగా సాగుతున్న జల వివాదానికి పరిష్కారం దొరికే అవకాశముంది.
ట్రిబ్యునల్ తీర్పు అమలు చేయడం వల్ల కొన్ని ప్రాంతీయ ప్రాజెక్టులపై గణనీయమైన ప్రభావం పడుతుందనే వాదనలున్నాయి. ఉదాహరణకు, కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే అవకాశం, మహారాష్ట్రలోని కోయిన ప్రాజెక్టుకు అదనపు నీటి కేటాయింపు వంటి అంశాలు ముందుకొస్తాయంటున్నారు. అయితే, వీటిని ఉమ్మడి ఏపీ సుదీర్ఘకాలంగా వ్యతిరేకిస్తూ వస్తోంది.
ఇప్పుడు ఈ వివాదంపై పైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ సమావేశం రాజకీయంగా, జలవనరుల పరంగా ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. కేంద్రం ఎవరి వాదనను స్వీకరిస్తుంది? జలాల పంపిణీలో రెండు రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందా? చూడాలి.