జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతపై అప్రమత్తత పెరిగింది. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తుల భద్రత కోసం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. తాజాగా నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో భద్రతను మరింత కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగా క్యాబ్ డ్రైవర్లతో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు సమావేశం నిర్వహించారు.
తిరుమలలో సేవలు అందిస్తున్న 400 మంది క్యాబ్ డ్రైవర్లు, 50 మంది క్యాబ్ యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై వారికి స్పష్టమైన సలహాలు ఇచ్చారు. భక్తుల రాకపోకలలో క్యాబ్ డ్రైవర్లది అత్యంత కీలకమైన పాత్ర అని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో వాహనాలు నడపాలంటే తప్పనిసరిగా వాలిడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు లేదా డయల్ 112 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తిరుమల భద్రతా చర్యల్లో ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా పనిచేయాలని హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేయడంలో భాగంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ తిరుమలలోని లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్నసుదర్శన్ సత్రం వద్ద చేపట్టారు. దాదాపు గంటన్నర పాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఉగ్రదాడి వంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, భక్తులను ఎలా సురక్షితంగా రక్షించాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. ఈ మాక్డ్రిల్లో ఆక్టోపస్ కమాండోలు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు (ఏపీఎస్పీ) బలగాలు పాల్గొన్నాయి.