భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మార్చి రెండో తేదీన హైదరాబాద్లో పర్యటించనున్నారు. సతీ సమేతంగా ఆయన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈమేరకు సచివాలయంలో ఆమె ఉన్నతాధికారులతో ఉప రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి మార్చి 2వ తేదీ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తారని.. అక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ ఐఐటీకి వస్తారని సీఎస్ తెలిపారు. అక్కడ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో సంభాషిస్తారని సీఎస్ శాంతికుమారి వివరించారు. ఆ తర్వాత శంషాబాద్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి అదే రోజు సాయంత్రం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారని సీఎస్ పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతి పర్యటన కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, కమ్యూనికేషన్ అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. దీని కోసం భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పోలీసు శాఖకు సూచించారు. ఉపరాష్ట్రపతి సందర్శించే అన్ని ప్రదేశాల్లో అర్హత కలిగిన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర వైద్య, విద్యుత్ శాఖ అధికారులకు సీఎస్ సూచించారు.