రామయ్య మృతి సమాజానికి తీరని లోటన్న రేవంత్, భట్టి
ప్రముఖ వృక్ష ప్రేమికుడు ప్రద్మశ్రీ అవార్డ్ గ్రహీత ఖమ్మం జిల్లా వాసి వనజీవి రామయ్య ఆనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతి పొందిన రామయ్య స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామం. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువ జామున గుండెపోటుతో కాలం చేశారు. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య తన జీవిత కాలంలో దాదాపు కోటికి పైగా మొక్కలను నాటి ప్రకృతి పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమను చాటుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2017లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. స్వగ్రామం ముత్తగూడెంలో ఐదొవ తరగతి వరకూ చదువుకున్న రామయ్యాకు ఆయన ఉపాధ్యాయుడు మల్లేశం బోధించిన మొక్కల పెంపకం అంశం ఆయనలో మొక్కలు నాటాలనే జిజ్ఞాసను పెంచింది. ముందుగా తన ఇంటి నుంచే మొక్కలు పెంచడం ప్రారంభించిన రామయ్య దశాబ్ధాల పాటు రోడ్ల పక్కన ఖాళీ స్ధలాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో దేవాలయాల్లో ఇలా ప్రతి చోటా ఎక్కడ ఖాళీ స్ధలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది. మొక్కల మీద అంతులేని ప్రేమ కారణంగా ఆయన తన మనవరాండ్లకు మొక్కల పేర్లనే పెట్టడం విశేషం. హరిత లావణ్య, వనశ్రీ, కబంధపుష్ఫ, చందన పుష్ఫ అని నలుగురు మనవరాళ్ళకు మొక్కల పేర్లు పెట్టుకున్నారు రామయ్య. కొన్ని దశాబ్ధాల పాటు ఆయన వేసవికాలం వచ్చిందంటే అడువుల్లో తిరుగుతూ రకరకాల మొక్కల విత్తనాలను సేకరించి మైదాన ప్రాంతాల్లో నాటేవాళ్ళు. ఆయన పెంచడమే కాకుండా తనను కలసిన వాళ్ళందరికీ విత్తనాలు ఇచ్చి మొక్కలు నాటేలా ప్రోత్సహించేవాళ్లు.
వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యవరణ ప్రేమికుడు రామయ్య మృతి సమాజానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన రామయ్యను పలు సంస్ధలు అవార్డులతో స్కరించాయి. ఇక తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాయి