రాజకీయ వ్యవస్థ నిస్వార్థంగా, నిబద్ధతతో పనిచేస్తేనే సమాజం బాగుపడుతుందని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ అన్నారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఈ పదేళ్ల పరిణామ క్రమం అబ్బురపరుస్తోందన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగిన “ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ – 2024” కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ పలువురికి అవార్డులు అందించారు.
ఒకప్పుడు భారత్ అంటే పేద దేశం, ఎదుగుతున్న దేశం అని ఉండే.. కానే ఇప్పుడు ఎదిగిన దేశం జాబితాలో చేరిందని ఈటెల వివరించారు. విదేశాల్లో ఉండే మనవాళ్లు నేను భారతీయుణ్ణి అని గల్లా ఎగురవేసుకుని చెప్పుకొనే పరిస్థితి వచ్చిందని, దీనికి కారణం మోడీ సుపరిపాలన అన్నారు. మన దేశంలో మౌలిక వసతుల రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.
దేశంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని, భారత జాతి గర్వపడేలా పాలన సాగుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థలో 11 వ స్థానం నుండి 5 వ స్థానంలోకి వచ్చామని, ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది ప్రధాని మోడీ సంకల్పమన్నారు. దానిని సాకారం చేయడం మనందరి భాద్యతని ఈటెల రాజేందర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్టు దేవ్ వర్మ, ఎంపీలు కె లక్ష్మన్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.