బర్డ్ ఫ్లూ వైరస్.. చికెన్ వ్యాపారులనే కాదు.. చికెన్ ప్రియులను కూడా బాధ పెడుతోంది. పౌల్ట్రీ వ్యాపారులకు నష్టం కలిగిస్తూంటే.. చికెన్ లవర్స్ను మాత్రం కష్ట పెడుతోంది.
ప్రస్తుతం ముహూర్తాల సీజన్ నడుస్తోంది. మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలు, ముఖ్యంగా పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. వేసవికి ముందే పెళ్లిళ్లు చేసేయాలన్న ఆలోచనలో ఉన్న జనం.. పంతుళ్లను బతిమిలాడి మరీ దగ్గర్లో ఉన్న ముహూర్తాలను ఖాయం చేసుకుంటున్నారు. అయితే, కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించడంతో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా ప్రకటించారు. చికెన్, కోడిగుడ్ల అమ్మకాలు నిషేధించారు. అయితే, ఈ పరిస్థితులు ఫంక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వాస్తవానికి పెళ్లయినా, ఏ శుభకార్యమయినా ముక్క లేకుండా జనానికి ముద్ద దిగదు అనే నానుడి ఉంది. శుభకార్యం ఏదైనా సరే.. నాన్వెజ్ ఉంటేనే పరిపూర్ణం అనే భావన సమాజంలో నాటుకుపోయింది. అయితే, బర్డ్ ఫ్లూ పుణ్యమా అని ఫంక్షన్లలో నాన్వెజ్ మెనూలో చికెన్ స్థానంలో మటన్ వచ్చి చేరుతోంది. దీంతో ఒక్కసారిగా ఖర్చు భారీగా పెరిగిపోతోంది.
కిలో చికెన్ ధర యావరేజ్గా చూసుకుంటే రూ.250లో వచ్చేస్తుంది. అదే.. కిలో మటన్ ధర 800 పైమాటే. ఒకవేళ, చికెన్, మటన్ రెండూ ఫంక్షన్లలో పెట్టినా.. చికెన్ వెరైటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు. చికెన్కు సంబంధించి చికెన్ బిర్యానీతో పాటు.. మూడు, నాలుగు వెరైటీలు చేస్తే.. కర్రీ కోసం మటన్కు ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. కానీ, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా మెనూ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీంతో, చికెన్తో పోలిస్తే.. మటన్కోసం ఒక్కో కిలోకు సుమారు రూ.500 అదనంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఫలితంగా ఫంక్షన్లలో భోజనాల ఖర్చు భారీగా పెరిగిపోతోందని వాపోతున్నారు.
మరికొన్ని ఫంక్షన్లలో చేపలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల కూడా ఖర్చు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. కిలో చేపలు రూ.300 నుంచి రూ.500 వరకు ధర ఉండడంతో ఫిష్ వంటకాలు చేయించాలన్నా అదనపు ఖర్చు అవుతోందంటున్నారు.