హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ లోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ – స్విస్ ప్రాంగణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కుటుంబంలోని తల్లి స్వయంగా వంట చేసి భోజనాన్ని తీసుకుని వచ్చి.. అక్కడ పిల్లలకు తినిపించేందుకు ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేళ.. కుటుంబ ప్రబోధనకు పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. సంఘ్ స్ఫూర్తితో కుటుంబ విలువలను ఈ తరం విద్యార్థులకు నేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. మొదటినుంచి భారతీయ విలువలను నేర్పించడంలో స్విస్ వ్యవస్థ .. ముందు వరుసలో నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. తల్లులంతా తెచ్చిన ఆహారాన్ని అందరూ పంచుకొని తినటం ద్వారా తామంతా వసుధైక కుటుంబం అని చాటి చెప్పారు. పిల్లలకు తాము తెచ్చిన ఆహారాన్ని కొసరి కొసరి తినిపిస్తూ అనుబంధాన్ని బలపరిచారు.
వాస్తవానికి ఆధునిక కాలంలో .. ఇంటిలో వంట చేసుకుని తినడం తగ్గిపోతోంది. బయటనుంచి జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తెప్పించు కోవడంతో ఆరోగ్యము ఆనందము ఆవిరై పోతున్నాయి. పిల్లలు, పెద్దలు బయట ఫుడ్కు అలవాటు పడటంతో … కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం తగ్గిపోతోంది. ఇటువంటి పోకడలకు దూరంగా మనదైక కుటుంబ వ్యవస్థను గుర్తు చేసేందుకు స్విస్ ఈ కార్యక్రమం చేపట్టింది . పిల్లలు సకుటుంబ సపరివార సమేతంగా రావడంతో స్విస్ ప్రాంగణం అంతా కళకళలాడింది. భారతీయ విలువలకు పెద్దపీట వేసే విద్యా భారతి అనుబంధంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో స్విస్ సేవలు అందిస్తోంది. ఇందులో పాలుపంచుకున్న మేనేజ్మెంట్ , తల్లితండ్రులు, సిబ్బంది , హితేషులకు ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర భట్ల కృష్ణమోహన్ కృతజ్ఞతలు తెలిపారు.