తిరుమల శ్రీవారి దర్శనం ఎటువంటి వెయిటింగ్ లేకుండా కేవలం గంట సమయంలో కల్పించే విధంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో టిటిడి ఏర్పాటు చేయనున్న ఫేస్ రికగ్నేషన్ ఎంట్రన్స్ యంత్రాల పనితీరును సోమవారం తిరుమలలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఏషియన్ కంపెనీకి చెందిన సిటీ ఆర్ యు హెచ్ కంపెనీ ప్రతినిధులు సోమవారం తిరుమలలో ఈ యంత్రం పనిచేయడం ఎలా అనే అంశంపై అధికారులకు పాలక మండలికి వివరించారు. ప్రయోగాత్మకంగా ఈ మిషనరీని టిటిడి పాలక మండలి అధ్యక్షులు బి.ఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు కార్యనిర్హణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యుల ముందు పనితీరును ప్రదర్శించారు.
అలాగే ఇదే తరహాలో మరికొంతమంది కంపెనీల నుండి ఫేస్ రికగ్నిషన్ మిషనరీని టిటిడి యాజమాన్యానికి ప్రదర్శించనున్నారు. దాదాపు 8 కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఫేస్ రికగ్నేషన్ ఆధునిక పరికరాలను అందించేందుకు ఇప్పటికే టీటీడీని సంప్రదించాయి. అన్ని కంపెనీల నమూనాలను పరిశీలించిన అనంతరం ఏ కంపెనీ నుండి యంత్రాలను సమకూర్చుకోవాలని అంశంపై టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. ప్రయోగాత్మక పరిశీలన వారం రోజుల్లో పూర్తి చేసి మరో మూడు మాసాలలోపు తిరుమలలో రెండు ప్రదేశాలలో దాదాపు ఒకొక్క ప్రదేశంలో 45 ముఖ ఆధారిత యంత్ర పరికరాలను అమర్చేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.