ట్రంప్ మరోసారి టారీఫ్లను విధించారు. ఈసారి ఆ దేశం, ఈ దేశం అని కాకుండా అమెరికా దిగుమతి చేసుకునే అన్ని కార్లపై 25 శాతం టారిఫ్లను విధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీంతో అమెరికాలో ఇకపై కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఈ టారిఫ్లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాలో ఉత్పత్తి అయ్యే కార్లపై మాత్రం ఎలాంటి టారిఫ్ ఉండదన్నారు ట్రంప్.
అమెరికాలో 50 శాతం కార్లు దిగుమతి అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మెక్సికో, కెనడా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ నుంచి అమెరికాకు ఎక్కువగా కార్లు దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఈ దేశాలపై ఎఫెక్ట్ పడనుంది. అయితే ఆ దేశాలపై ఎంత ఎఫెక్ట్ పడుతుందో.. అమెరికాలోని కార్లు కొనాలనుకునేవారిపై కూడా అంతే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అమెరికా స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్లు విధించారు. దీంతో కార్ల తయారీ ధరలు పెరగనున్నాయి. ఇప్పుడు కార్ల దిగుమతులపై టారిఫ్లు పెంచడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి. మొత్తంగా చూస్తే దేశీయంగా తయారైన కార్లు.. విదేశాల నుంచి దిగుమతయ్యే కార్ల ధరలు.. ఇలా అన్ని రకాల కార్ల ధరలు కూడా పెరగనున్నాయి.
ఇప్పటికే ఈ ఎఫెక్ట్ టాటా కంపెనీల షేర్లపై పడింది. అమెరికాలో టారిఫ్ల పెంపునకు, టాటా షేర్లకు సంబంధమేంటన్న అనుమానం రావొచ్చు. అమెరికాలో జాగ్వార్ కార్లు చాలా ఫేమస్. ఇప్పుడీ కార్ల అమ్మకాలపై ఎఫెక్ట్ పడనుంది. అయితే జాగ్వార్ కార్ల మాతృ సంస్థ టాటా కావడంతో.. ట్రంప్ అనౌన్స్మెంట్ రాగానే ఆ కంపెనీ షేర్లపై ఎఫెక్ట్ పడింది.
టారిఫ్ల విషయంలో తగ్గేదేలే అంటూ ఇప్పటి వరకు కనిపించిన ట్రంప్.. ఇప్పుడు మాత్రం కాస్త తగ్గినట్టే కనిపించింది. ప్రతీకార టారిఫ్లు విధిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని.. అందుకే కొన్ని దేశాల విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టారిఫ్ల పెంపు అనంతరం జరిగే పరిణామాలపై ఇప్పటికే అంతర్గతంగా విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్ట్ అందిన తర్వాత ట్రంప్ స్వరం మారినట్టు తెలుస్తోంది. ఇలా టారిఫ్లు విధించడం అమెరికా ఆర్థికవ్యవస్థకు అంత మంచిది కాదన్న నిర్ణయం కాదని నివేదిక చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే టారిఫ్ల విషయంలో ట్రంప్ కాస్త ఆచితూచి మాట్లాడినట్టు తెలుస్తోంది.