39.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

ట్రంప్ టవర్స్ స్థల వివాదం

హైదరాబాద్‌ రియాల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో గ్లోబల్‌ బ్రాండ్‌గా పేరొందిన ట్రంప్‌ రియాల్టీ సంస్థ కోకాపేటలో అత్యంత విలాసవంతమైన టవర్స్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్ట్‌ ప్రారంభం కాకముందే స్థల యాజమాన్య వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం ట్రంప్‌ టవర్స్‌ నిర్మాణ ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ భారతదేశంలో ఇప్పటికే ముంబై, కోల్‌కతా, గుర్‌గావ్, పుణెలలో విలాసవంతమైన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా నిర్మించింది.

హైదరాబాద్‌లోని కోకాపేట గోల్డెన్‌ మైల్‌ ప్రాంతంలో రూ3,500 కోట్ల విలువైన ట్రంప్‌ టవర్స్‌ నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో మూడు టవర్లు, 66 అంతస్తులు, 243 మీటర్ల ఎత్తుతో నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌కు భారతీయ భాగస్వామిగా ఐరా రియాల్టీని ఎంచుకున్నారు. కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ ప్రాంతంలో ఐరా రియాల్టీకి చెందిన స్థలంలో టవర్ల నిర్మాణం జరగనుంది. అనుమతుల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు ప్రచారం జరిగింది. ఈ ఏడాది చివరలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారీ ప్రాజెక్ట్‌ మొదలు కాకముందే స్థల యాజమాన్య వివాదం తలెత్తింది. నాందెల రామ్‌రెడ్డి అనే వ్యక్తి తాను కూడా ఈ స్థలంలో సహ యజమాని అని, తనకు తెలియకుండానే ట్రంప్‌ టవర్స్‌ నిర్మాణ ప్రకటనలు జరిగాయని ఆరోపిస్తూ బహిరంగ లీగల్‌ నోటీసు జారీ చేశారు.

రామ్‌రెడ్డి తరపు న్యాయవాది జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, గోల్డెన్‌ మైల్‌ ప్రాంతంలోని 12,602 గజాల స్థలంలో రామ్‌రెడ్డికి 425 గజాల వాటా ఉంది. ఈ స్థలాన్ని ఐరా రియాల్టీతోపాటు పది మందికి పైగా వ్యక్తులు కలిసి కొనుగోలు చేశారని, అందులో రామ్‌రెడ్డి ఒకరని వారు పేర్కొన్నారు. రామ్‌రెడ్డి తనకు సమాచారం ఇవ్వకుండా ఈ స్థలంపై ట్రంప్‌ టవర్స్‌ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం తన హక్కులను కాలరాసినట్లు భావిస్తున్నారు. ఈ విషయంలో తాను ఊరుకునేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

స్థల యాజమాన్య వివాదం ట్రంప్‌ టవర్స్‌ ప్రాజెక్ట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇటువంటి చట్టపరమైన సమస్యలు పరిష్కారం కాకపోతే, ప్రాజెక్ట్‌ ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంది. గతంలో కూడా హైదరాబాద్‌లోని కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లు స్థల వివాదాల కారణంగా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఐరా రియాల్టీ, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తాయనేది ఇప్పుడు కీలకం. ఒకవేళ రామ్‌రెడ్డితో చర్చలు జరిపి, ఆయన వాటాను కొనుగోలు చేయడం లేదా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించగలిగితే, ప్రాజెక్ట్‌ పురోగతిలోకి వెళ్లే అవకాశం ఉంది. అలా కాకపోతే, ఈ వివాదం చట్టపరమైన పోరాటంగా మారి, ప్రాజెక్ట్‌ను వెనక్కి నెట్టవచ్చు.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ గత కొన్నేళ్లుగా వేగంగా వృద్ధి చెందుతోంది. కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి ప్రాంతాలు విలాసవంతమైన నివాస ప్రాజెక్ట్‌లకు కేంద్రంగా మారాయి. ట్రంప్‌ టవర్స్‌ వంటి గ్లోబల్‌ బ్రాండ్‌ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం ఉంది. స్థల వివాదాలు ఈ అవకాశాలను అడ్డుకోవచ్చు రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com