భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. గడచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ళుగా పరిష్కారానికి నోచుకోని భూములకు శాస్వత పరిష్కారం ఇవ్వాలనే ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని గత నెల 14వ తేదీన ప్రారంభించారని చెప్పారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలు ర్యాండమ్ గా ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభించిన రెవెన్యూ సదస్సులు కూడా 28 జిల్లాల్లోని 28 మండలాల్లో ఈనెల 30వ తేదీ వరకూ కొనసాగుతాయన్నారు. ఇప్పటి వరకూ నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సుల ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూభారతి పరిధిలోకి వచ్చే అభ్యర్ధనలను నిర్ణీత గడువు లోపల పరిష్కారం చూపిస్తామని మంత్రి పేర్కొన్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద గత నెలలో నాలుగు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని పరిష్కరించడం జరిగిందని ఈనెల 30వ తేదీలోగా దాదాపు 60 శాతం భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ప్రకటించారు. పరిష్కారం కాని భూ సమస్యలు ఎందుకు పరిష్కారం అవ్వడం లేదనే సమాచారన్ని దరఖాస్తుదారుడికి లిఖిత పూర్వకంగా తెలియజేస్తామని మంత్రి తెలిపారు. రెండొవ దశలో 28 మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను కూడా ఈనెలాఖరు వరకూ వైలైనన్ని పరిష్కరించాలని ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పొంగులేటి చెప్పారు. సాదాబైనామాలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టులో స్టే వెకేట్ అయిన వెంటనే ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తామని, అయితే ఆన్ లైన్ లో ఉన్న దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.