మిథిలా స్టేడియం :
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకకు నిలిచే మిథిలా స్టేడియం ఆరు దశాబ్దాల క్రితం నిర్మించబడిన అద్భుత కట్టడం. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను, రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఈ కళ్యాణ మండపం పై చెక్కడం జరిగింది. తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్తపతి ఈ మిథిలా మైదానం రూపకర్త.
కళ్యాణంలో వధూ వరులకు అలంకరించే నగలు ఇవే…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో కొలువైయున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి అమ్మవారికి విశేషమైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వజ్రాలతో పొదిగిన పచ్చల పతకం, కెంపులు,ముత్యాలతో వేలాడే చింతాకు పతకం మొదలు కిరీటం, వజ్రాలు పొదిగిన కలికితురాయి తోపాటు విలువైన ఆభరణాలు భక్తరామదాసు చేయించారు.
చింతాకు పతకము: రామ భక్తుడైన రామదాసు. సీతమ్మవారికి అత్యంత సుందరమైన చింతాకు పతకాన్ని చేయించారు. రామదాసు అక్షరాల పదివేల వరహాల ధనాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది సీతారాముల కల్యాణ ఘట్టమైన శ్రీరామనవమి వేడుక రోజున అమ్మవారికి ఈ చింతాకు పతకముని ఆలయ అర్చకులు అలంకరిస్తారు.
ముత్యాల పతకము:
లక్ష్మణ స్వామికి చేయించిన బంగారు ఆభరణమే ఈ ముత్యాల పతకము. నాడు లక్ష్మణ స్వామికి రామ భక్తుడైన రామదాసు. చేయించిన దీని విలువ అక్షరాల పదివేల మొహరీలు. కల్యాణ ఘట్టమైన శ్రీరామనవమి వేడుకలో ఈ ముత్యాల పతకము ఆలయ అర్చకులు లక్ష్మణునికి అలంకరిస్తారు.
కలికితురాయి:
భద్రాచల ఆలయ నిర్మాణ అనంతరం రామచంద్రమూర్తికి చేయించిన బంగారు ఆభరణాలలో ఈ కలికితురాయి ఒకటి. దీనితోపాటుగా భక్త రామదాసు చేయించిన పలు బంగారు ఆభరణాలు భద్రాద్రి ఆలయంలోని మ్యూజియంలో భక్తుల దర్శనార్థం ఉంచడం జరిగినది. ఆభరణాలన్నీ ప్రతి ఏడాది భద్రాచల ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి వేడుక రోజున సీత, లక్ష్మణ, రామచంద్రమూర్తులకు ఆలయ అర్చకులు అలంకరిస్తారు.
అమ్మవారి మంగళ సూత్రం:
రామ భక్తుడైన రామదాసు ప్రతి ఏడాది భద్రాచలం వేదికగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీతమ్మ తల్లికి అత్యంత సుందరమైన మంగళసూత్రాన్ని తయారు చేయించారు. హిందూ వివాహ విధానంలో మాంగల్యధారణే అతి ప్రధానమైనది ఈ నేపథ్యంలో వధువుకు పుట్టింటి తరఫున, మెట్టినింటి తరపున పుస్తెల తాడుకు రెండు సూత్రాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీ. కానీ భద్రాచల క్షేత్రంలోని సీతమ్మ తల్లి మంగళ సూత్రానికి మాత్రం పుట్టింటి తరఫున, మెట్టినింటి తరఫున మాత్రమే కాకుండా రామదాసు తరపున సైతం పుస్తెలతాడుకు ఒక సూత్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం.