తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ . కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పుల తడక అంటున్నారని విమర్శించారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకుపైగా సిబ్బందిని నియమించి ఇంటింటికీ తిరిగి స్వయంగా పరిశీలించి కులగణన చేపట్టడం జరిగిందన్నారు. కులగణన దేశానికే ఆదర్శంగా చేపట్టామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఆదేశాను సారం కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసిందని పీసీసీ చీఫ్ చెప్పారు.
కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదన్నారు మహేష్ కుమార్ గౌడ్. 1931 తర్వాత తెలంగాణలో మాత్రమే కులగణన జరిగిందన్నారు. దీంతో, బీసీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పక్కాగా పకడ్బందీగా కులగణనను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు.
2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు పారదర్శకంగా చేసిన సర్వే గురించి మాట్లాడడం అవివేకమన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారని చెప్పారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ – సర్వే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బలహీనవర్గాల గురించి కేటీఆర్ మాట్లాడటం హస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటిచేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.