సరోగసీ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీనాగరత్న పరోక్షంగా సమర్ధించారు. దక్షిణ భారత ప్రజల్లో ఈ విషయంలో ఆందోళన నెలకొన్నట్లు జస్టిస్ నాగరత్న గుర్తు చేశారు. వాస్తవానికి జస్టిస్ బీవీనాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సరోగసీ చట్టానికి సంబంధించి దాఖలైన పిటీషన్లపై శుక్రవారం చేస్తున్న విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న ఈవిధంగా వ్యాఖ్యలు చేశారు. సరోగసీ ద్వారా ద్వితీయ సంతానం పొందడానికి అనుమతి ఇవ్వాలని ఓ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా సంఖ్య తగ్గిపోతోందని, ఉత్తరాదిలో మాత్రం ఇందకు భిన్నంగా జనాభా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్వభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళణ వవ్యక్తం చేస్తున్నాయని జస్టిస్ నాగరత్న అన్నారు. ఇదే జరిగితే పార్లమెంటులో ఉత్తరాది ప్రాధాన్యం పెరిగి దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుందని అందోళన చెందుతున్నారని జస్టిస్ నాగరత్న వివరించారు. ఒక బిడ్డ ఉంది కదా రెండో బిడ్డ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయమూర్తి పిటీషనర్లను ప్రశ్నించారు. దేశ ప్రయోజనాల కోసం ఒక బిడ్డతో సరిపెట్టుకోవచ్చు కదా అని సూచించిన న్యాయమూర్తి ఈ కేసు విచారణను వాయిదా వేశారు.