హెచ్సీయూ భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఒకరు ఉన్నారని ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ ఆ పేరు ఎందుకు బయటపెట్టడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. వాస్తవానికి రాష్ట్రంలో అసమర్ధ అవినీతి ప్రభుత్వం నడుస్తోందని, రేవంత్రెడ్డి పాలనపై పెద్దల నుంచి అంగన్ వాడీ కార్యకర్తల వరకూ ఎంరూ సంతృప్తిగా లేరని ఎంపీ విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధత నుంచి దృష్టి మరల్చడానికే హెచ్సీయూ, హైడ్రా వివాదాలు తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి కాంగ్రెస్ ఇన్ని వాగ్దానాలు ఎలా ఇచ్చిందని ఎంపీ అరవింద్ నిలదీశారు. కేసీఆర్, రేవంత్రెడ్డిల కధ గజదొంగ గంగన్న, ఆయన కొడుకు రంగన్న కధలా ఉందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి 2018లోనే కేసీఆర్ ఓడిపోవాలని, కానీ ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అవకాశాన్ని అమ్మేసుకున్నారని ఎంపీ అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డిని మార్చాలని చూస్తోందని కానీ ఇప్పుడున్న సీయంను మారిస్తే ఆయన తరువాత సీయం అయ్యే అర్హత ఉన్న వ్యక్తి వారికి దొరకడం లేదన్నారు. సీయం అయ్యే ఎలిజిబులిటీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఉన్నా ఆయనకు వసూళ్లు చెయ్యడం రాదన్నారు. అందుకే కాంగ్రెస్ సీయం మార్పు విషయంలో వెనక్కి తగ్గుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.