వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో నానీల హవా బాగా కొనసాగేది. ముందు నుంచి కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ళ నానిలు వైసీపీలో కీలక నాయకులుగా వ్యవహరించారు. అందుకు తగ్గట్లుగానే జగన్మోహన్రెడ్డి క్యాబినేట్లో ముగ్గురినీ మంత్రి పదవులు వరించాయి. ఇక అధికారాంతమున ఎంటరైన మరో నాని కేశినేని నాని. రెండు పర్యాయాలు టీడీపీ తరపు నుంచి విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కేశినేని నాని తన తమ్ముడు కేశినేని చిన్నీని పార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తోందని అలిగి టీడీపీని వీడి 2024 చివరిలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నలుగులు నానీలు గడచిన ఐదేళ్ల పాటు ఆడింది ఆట పాడింది పాటలా రాజకీయం చేసి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ఇద్దరు నానీలైతే తెలుగుదేశం పార్టీని విలవిల్లాడించారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ మీడియా ముందుకు వస్తే బాబు, లోకేష్ పవన్లపై తిట్లదండకం ఎత్తుకునేవారు. ఆ ముగ్గురిపై తీవ్ర విమర్శలు చెయ్యడమే కాకుండా వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. ఈ నానీలిద్దరికీ వైఎస్సార్సీపీలో ఎంత హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారో టీడీపీ, జనసేనల్లో అంత కరుడుకట్టిన శత్రువులు ఉన్నారు. అయితే అదంతా గతం… ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది. పార్టీతో పాటు నానీలఉ అధికార దర్పం కూడా కోల్పోయారు. అంతకు ముందు వీలు కల్పించుకుని మరీ మీడియా ముందుకు వచ్చే నానీలు ఇప్పుడు కెమెరా లెన్స్కు దొరకడం లేదు.
ఆళ్ల నానీ…
2009లో వైఎస్.రాజశేఖర్రెడ్డి మృతి తరువాత జగన్ వెంట నిలబడ్డ ఆళ్ళనానినీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపముఖ్యమంత్రిని చేసి కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను ఇచ్చారు జగన్మోహన్రెడ్డి. అన్నేళ్ళు జగన్ వెంబడ ఉండి అధికారం కోల్పోయాక పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు ఆళ్ళనాని. తెరమీద ఎక్కడా కనిపించడం లేదు. అధికార టీడీపీ నుంచి వస్తున్న బెదిరింపులకో లేక సొంత సామాజికవర్గం నుంచి వస్తున్న ఒత్తిళ్ళకు తలొగ్గో మొత్తానికి వైసీపీని వీడారు. ప్రస్తుతం టీడీపీ పంచన చేరడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా టీడీపీ నేతలు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఇవాళో రేపో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయం. అయితే అధికారం కోల్పోయిన ఈ తొమ్మొది నెలల్లో ఆయన ఎక్కడా మీడియా ముందకు రాలేదు. ప్రత్యర్ధి రాజకీయ పార్టీ నేతలను పల్లెత్తు విమర్శించలేదు. గోడ మీద పిల్లాలా తన రాజకీయ జీవితం గడుపుతున్నారు. బహుశా టీడీపీలో చేరాకా మళ్ళీ ప్రోయాక్టీవ్ అవ్వచ్చు.
కొడాలి నాని…
వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ప్రప్రధముడు కొడాలి నాని. ఆ పార్టీలో వైఎస్.జగన్ తరువాత అంతగా కార్యకర్తలు ప్రేమించే నాయకు డు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నానినే. కొడాలి మీడియా ముందుకు వచ్చాడంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ముష్టాన్న భోజనం దొరికినట్లే. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబుని, ఆయన తనయుడు నారాలోకేష్ని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అడ్డూ అదుపు లేకుండా విమర్శించేవారు, తూలనాడేవారు. ఆ మాటకొస్తే జగన్ని ప్రత్యర్ధి పార్టీల నేతలు ఎవరేమన్నా వారిని చీల్చి చెండాటంలో ముందు వరుసలో నిలబడేవారు కొడాలి నాని. ఇది ఎంతవరకూ వెళ్ళిందంటే… టీడీపీ శ్రేణులకు జగన్మోహన్రెడ్డిని అధికారం నుంచి దింపాలనే కసి కన్నా… తాము అధికారంలోకి వచ్చాక కొడాలినాని పని పట్టాలనే కసే ఎక్కువగా ఉండేది. వాళ్లు అనుకున్నట్లుగానే వైసీపీని గద్దె అయితే దించగలిగారు కానీ ఆరు నెలలైనా కొడాలి నానీని తమ అగ్రనేతలు ఏమీ చేయలేక పోతున్నారనే అసంతృప్తి తెలుగు తమ్ముళ్ళందరి మనసుల్లో గూడు కట్టుకుపోయి ఉంది. ఇక నానీ కూడీ అలవి కాని చోట అధికులమనరాదు అన్నట్లుగా ఎక్కడా ఫోకస్ కావడం లేదు. ఇంతకు ముందులా తరచు మీడియా ముందుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వాస్తవం మాట్లాడుకోవాలంటే ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్లే ఉన్నారు.
పేర్ని నాని…
మంచి భాష, స్పష్టమైన వ్యక్తీకరణ ఉన్న పేర్నినాని స్వతహగా సౌమ్యుడు. కానీ దురదృష్టం అప్పట్లో ఆయన నిర్వహించిన శాఖల్లో ఒకటైన సినిమాటోగ్రఫీ శాఖ వల్ల అందరి నోళ్ళల్లో ఎక్కువగా పడ్డారు. ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలపై కంట్రోల్ తెచ్చుకోవాలనుకోవడం, సినిమాలకు స్పెషల్ షోల అనుమతుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసకున్నారు. సరిగ్గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా విడుదలకు సిద్దమవడం… ఆయన సినీ వేదికల పై నుంచి పేర్ని నానీని పరష పదజాలంతో విమర్శిచడం… దానికి కౌంటర్ గా పేర్ని నానీ సైతం పరుష పదజాలం ఉపయోగించి పవన్ కళ్యాణ్పై ప్రతి విమర్శలు చేయడంతో ఆయన జనసేన పార్టీ క్యాడర్కి, పవన్ కళ్యాణ్ అభిమానులకు, కాపు సామాజికవర్గానికి అందరికీ ఒక్కసారిగా శత్రువైపోయారు. జనసేన నుంచి విమర్శలు రావడం దానికి అంతే ధీటుగా నాని కౌంటర్లు ఇవ్వడంతో ఆయన కూడా బూతుల మంత్రుల జాబితాలో చేరిపోయారు. అయితే అప్పుడు పవన్పై చేసిన విమర్శలకు ఇప్పుడు పేర్ని నాని మూల్యం చెల్లించుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖకు చెందిన పీడీఎస్ బియ్యం మాయమైన ఘటనలో మాజీ మంత్రి పేర్నినాని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అధికారం కోల్పోయాక వైసీపీ అధికార ప్రతినిధిగా ఎంతో కొంత పార్టీని డిఫెన్స్ చేసి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న పేర్నినాని నోరు రేషన్ బియ్యం కేసుతో మూయించారు. బహుశా వచ్చే నాలుగేళ్లు ఆయనింక మౌన వ్రతంలోనే ఉంటారని టాక్ నడుస్తోంది.
కేశినేని నాని…
తనను కాదని తమ్ముడ్ని ప్రోత్సహిస్తున్నారని లోకేష్ మీద అలిగి ఎరక్కపోయి వైసీపీలోకి వచ్చి ఇరుక్కుపోయారు కేశినేని నాని. కేశినేని నాని ఎక్కడ ఉన్నా ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడ్డారు. తన రాజకీయ జీవితం ప్రజారాజ్యంతో ప్రారంభించినా కొద్దినెలలకే ఆపార్టీ అధ్యక్షుడు సనీ నటుడు అయిన చిరంజీవిపై ఓ వార్తా ఛానల్లో కూర్చుని కడిగిపడేశారు. మరీ ముక్కుసూటి తనం వల్ల టీడీపీలో ఉన్నప్పుడే ఆర్టీఏ అధికారులపై అలిగి తరతరాలుగా చేస్తున్న ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేసారు. అదే టెంపోలో 2024లో ఏకంగా తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది కేశినేని నానీ పరిస్ధితి. ఎక్కడా కనిపించడం లేదు… ఎక్కడా వినిపించడం లేదు.