24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

విజన్ 2047 అరచేతిలో వైకుంఠం – షర్మిల విమర్శ

ఆంధ్రప్రదేశ్ దశ – దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజన్ 2047 పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని ఎక్స్ వేదికగా హితవు పలికారు.

షర్మిల కామెంట్స్ లో ముఖ్యాంశాలు

దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు. పూర్తిగా అటకెక్కించారు. రాష్ట్ర విభజన సమయంలో అనాడు UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించింది. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసింది.

మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13 లో పొందపరిచింది. కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో పొందపరిచింది. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయి.
ఇవ్వాళ్టికి ఒక్క హామీకి దిక్కులేకుండా పోయింది. గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవి. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవి. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది.

విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవి. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది వుంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేది. విభజన హామీలు అమలయ్యి ఉంటే రాష్ట్రం దిశ – దశ పూర్తిగా మారేది. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేది. విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోడీ  కాగా.. రెండో ముద్దాయి చంద్రబాబు.. మూడో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి.

ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోడీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారు. 25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు. చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే రాష్ట్రానికి విజన్. మోడీ పిలక మీ చేతుల్లో ఉంది. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com