25.1 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యం కావాలి – భట్టి

  • సైంటిఫిక్ విధానం కనుగొనే వరకు పునర్విభజన వాయిదా వేయాలి

  • నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశంలో నేతలు

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యంగా ఉండేలా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, రిపబ్లిక్ కన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేశారు.

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా తెలంగాణ నష్టపోతుందని, ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చలు, ఆలోచనలు చేయాలని సమావేశానికి హాజరైన రాజకీయ పక్షాలను డిప్యూటీ సీఎం కోరారు. మన గౌరవం, ప్రాధాన్యత కాపాడుకుంటూ భారత దేశంలో మన అందరి పాత్ర ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశానికి బీఆర్ఎస్ నేతలను సైతం ఆహ్వానించినప్పటికీ వారు ప్రత్యేక రాజకీయ కారణాలతో సమావేశానికి హాజరు కాలేమని తెలిపారని డిప్యూటీ సీఎం వివరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉండడం, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు హాజరు కాలేదని డిప్యూటీ సీఎం వివరించారు.

సమావేశానికి హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తులో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో ప్రణాళిక తయారు చేసుకొనే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం వివరించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఏర్పాటును వ్యతిరేకిస్తూ శాసనసభలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఆందోళనకు దారి తీయకుండా కొంతకాలం ఇదే విధానం కొనసాగించాలని, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆలోచన చేయకపోతే ప్రమాదం ఉందన్న స్పృహ వారికి కలగజేయాలనీ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక సైంటిఫిక్ నిర్ణయం వచ్చేవరకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతానికి అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచాలని సిపిఐ శాసనసభ పక్ష నేత k .సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు ఈ అంశంపై పోరాటం చేస్తూ మరోవైపు సైంటిఫిక్ పరిష్కారం కోసం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు నిత్యం ఆలోచన చేయాలని కూనంనేని, వెస్లీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నియోజకవర్గ పునర్విభజనపై జాతీయస్థాయిలో ఒక పాలసీని తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫెడరల్ స్టేట్ అంటే ప్రతి రాష్ట్రానికి సమాన హక్కు ఉండాలి, నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయమని సిపిఎం మాస్ లైన్ నేత హనుమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతం ప్రకారం దక్షిణాదిలోను నియోజకవర్గాలు పెరగాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ప్రాథమిక సమావేశమైనని రాబోయే రోజుల్లో విస్తృతంగా ఈ అంశంపై చర్చ, కార్యక్రమాలు చేపట్టాలని అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆచరణలో పెట్టేందుకు సిద్ధమని సమావేశానికి హాజరైన పార్టీల నేతలు తెలిపారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, ఎంఐఎం శాసనసభక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు హనుమేష్, సూర్యం, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నెల్లికంటి సత్యం, రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి సిహెచ్ బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బి మహేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com