సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై శనివారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిచారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచారహక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరంగా ఉందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మేఘా సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్ ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సిఎం రేవంత్ – మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్వాల్ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి మేఘా నిర్లక్ష్యం వల్ల గండిపడిందన్నారు. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోందని వ్యాఖ్యానించారు. సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టే అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని ఎత్తిచూపారు కేటీఆర్. బ్లాక్లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.