రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కూలీలకు ప్రతి రోజు పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దశంతో కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ (నరేగా) అపహాస్యం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ కూలీలకు ఉపాధి హామీ పథకం అమలు ఒక ఫార్సుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పధకం అధికార పార్టీలకు చెందిన గ్రామ, మండల స్ధాయి నేతలకు ఆదాయ వనరుగా తయారైంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు కూడా తమ క్యాడర్ ఈ పధకాన్ని అడ్డుపెట్టకుని నాలుగు రూపాయలు సంపాదించుకుంటారులే అనే ధోరణిలో ఉండటంతో నిజమైన నిరుపేద కూలీలకు నరేగా పధకం అక్కరకు రావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం దీనికి తోడై గ్రామ, మండల స్ధాయిలో అధికార పార్టీ నేతలు ఈ పధకాన్ని అడ్డం పెట్టకుని అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు.
కూలి పనులు దొరకని సయంలో రోజువారీ కూలీలకు కరువు పనులు చేయించడం ద్వారా అంటే చెరువులు, కుంటల్లో పూడిక తీతలు చేయింయడం తద్వారా సాలీనా కనీసం వంద రోజులు ఉపాధి కల్పించాలనేది నరేగా లక్ష్యం. ఈ పనులకు వచ్చే కూలీలకు రోజుకు మూడు వందల రూపాయల వేతనం చెల్లిస్తారు. పధకం అమలు నుంచి ఇది కూలీలకు చాలా ఉపయోగపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది కూలీలు ఉపాధి పొందారు. అయితే ఈ మధ్య కాలంలో నాయకుల కళ్ళు నరేగా మీద పడ్డాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉబయగోదావరి జిల్లాల్లో అధికార కూటమి పార్టీలకు చెందిన గ్రామ, మండల స్ధాయి నాయకులు ఉపాధి హామీ పధకాన్ని తమ హస్తగతం చేసుకున్నారు.
ఉపాధి అవసరమైన కూలీలకు పనులు ఇవ్వకుండా మస్టర్ రోల్స్ లో తమ బినామీ పేర్లు రాసుకుంటూ ప్రతి రోజూ వేల రూపాయల అక్రమంగా సంపాదిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మస్టర్ రోల్స్ తనఖీ చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. మస్టర్ రోల్స్ లో ఉన్న పేర్లు చూస్తూ ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. నిత్యావసర వస్తులు కొనడానికి కూడా ఎప్పుడూ ఇల్లు కదలని మధ్య, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తుల పేర్లు అనేక మందివి మనకు హాజరు పట్టీలో కనిపిస్తాయి. వాస్తవానికి వీరెవరు కరువు పనులకు వెళ్ళరు… అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేసి పనులకు వెళ్లినట్లు హాజరు పట్టీలో చూపిస్తారు అంతే. ఒకరిద్దరు వెళ్లినా, గంటో అరగంటో ఉండి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఒక్కో నాయకుడు ఇటువంటి బినామీ పేర్లు ఇరవై, ముప్పై పెట్టించుకుని రోజూ వేల రూపాయలు తమ బొక్కసాల్లో వేసుకుంటున్నారు. అధికారులు కూడా వీరికి సహకరిస్తుండటంతో ఉభయగోదావరి జిల్లాల్లో ఉపాధి హామీ పధకం అపహస్యమవుతోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.