భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావం సందర్భంగా జనసేన జయకేతనం సదస్సులో ఆయన ప్రసంగం ఆవేశంగా సాగింది. మొదట తన ప్రసంగాన్ని తమిళ భాషలో ప్రారంభించిన పవన్ కల్యాణ్.. దేశంలోని పలు రాష్ట్రాల భాషలను కూడా ప్రస్తావించారు. జాతీయ భాషగా పేర్కొనే హిందీ మొదలు.. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ దాకా.. పలు భాషల్లో మాట్లాడారు.
మహారాష్ట్రతో పాటు.. తమిళనాడు, కర్ణాటకలోనూ.. తనకు అభిమానులు ఉన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే.. భాష ఏదైనా భావం ఒక్కటే కీలకమని.. అభిప్రాయ పడ్డారు. దేశానికి బహుభాషే అవసరమన్నారు. ఇదే దేశానికి జీవనాడిగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన భాషల్లో మాట్లాడారు. తమిళనాడుతో పాటు.. అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని సూచించారు.
తాను చెప్పేది వినాలని పవన్ కల్యాణ్ సభకు హాజరైన వాళ్లకు సూచించారు. తమకు ఓడిపోతామన్న భయం లేనందువల్లే 2024లో పుంజుకున్నామని, ప్రభుత్వంలో భాగస్వాములమయ్యామని పవన్ కల్యాణ్ చెప్పారు.