అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడి జరిగింది. అది కూడా డ్రోన్ దాడి. ఈ దాడిలో ప్లాంట్ నుంచి రేడియేషన్ లీక్ కాకుండా ఏర్పాటు చేసిన షెల్టర్పై ఈ దాడి జరిగింది. దీంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం మరోసారి ఆ ప్రాంతంవైపు చూసింది.
భిన్న వాదనలు..
చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్పై రష్యన్ ఆర్మీ డ్రోన్ దాడి చేసిందని ఆరోపించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఈ దాడిలో ప్రొటెక్టివ్ కంటెయిన్మెంట్ షెల్ దెబ్బతిన్నదని.. దీని వల్ల మంటలు చెలరేగాయని ఆయన తెలిపారు. వెంటనే రెస్క్యూ టీమ్స్ మంటలను ఆర్పివేశాయని.. ప్లాంట్ నుంచి ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. అయితే ఈ దాడి చేసింది రష్యానే అని ఆయన ఆరోపించారు. అయితే జెలెన్ స్కీ ఆరోపణలను రష్యా ఖండించింది. ప్రజలను ప్రమాదంలో పడేసే ఇలాంటి పనులు రష్యన్ ఆర్మీ ఎప్పుడూ చేయదని ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ దాడిని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ కూడా ధ్రువీకరించింది.
దాడి జరిగిన సమయంపై అనుమానాలు..
నిజానికి మ్యూనిచ్లో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ జరగాల్సి ఉంది. సరిగ్గా ఈ చర్చ ప్రారంభమవడానికి కొన్ని గంటల ముందే చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడి జరిగింది. మరోవైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధాన్ని ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన చర్చలను జరిపేందుకు ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఈ దాడి జరిగిన సమయం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ దాడిపై కూడా ఇప్పుడు మ్యూనిచ్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ భేటీలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భేటీ కానున్నారు. మొత్తానికైతే ఈ యుద్ధానికి ముగింపు పలకడం ఇష్టం లేని వారే ఈ దాడికి పాల్పడ్డారనేది అర్థమవుతుంది.
ఒకే మాట ఇద్దరి నోట..
తమతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా లేరని చెప్పడానికి ఈ దాడే ఓ సూచన అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపిస్తున్నారు. అంతేకాదు కీలకమైన ప్రాంతాలపై దాడిచేసేందుకూ రష్యా ఏ మాత్రం ఆలోచించదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. న్యూక్లియర్ రియాక్టర్లపై దాడులు ఎంత ప్రమాదకరమో తెలిసినా.. రష్యా ఏ మాత్రం లెక్క చేయడం లేదని.. ఇది ఉగ్రవాద చర్య అంటూ తీవ్రమైన పదాలను వాడారు. ఆయన మాటతీరును బట్టి చూస్తే ఈ ఒక్క ఘటన చాలు.. రష్యాపై ప్రపంచ దేశాలు యుద్ధం ప్రకటించాలని అన్నట్టుగా ఉన్నాయి. ఇక ఇలాంటి భాషనే రష్యా కూడా ఉపయోగించింది. ఓ వైపు యుద్ధం ముగించాలని చూస్తుంటే.. కావాలనే ఇలాంటి దాడులు చేసి యుద్ధాన్ని పెంచాలని జెలెన్ స్కీ చూస్తున్నారంటూ రష్యా చెబుతోంది. ఇరు దేశాల వాదనలు ఒకేలా కనిపిస్తున్నాయి. మరి నిజంగా న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేసింది ఎవరు? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కావాలనే ఎవరైనా కుట్ర చేశారా? అనేది ప్రస్తుతానికైతే మిస్టరీగానే మారింది.
ఉక్రెయిన్లోని బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్. 1986లో ఈ ప్లాంట్లో భారీ పేలుడు జరిగింది. భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఆ తర్వాత స్టీల్, కాంక్రీట్తో అణురియాక్టర్లను మూసేశారు.