ఇవాళ మహా శివరాత్రి పర్వదినం, మహా కుంభమేళా చివరి రోజు, దీంతో, మహిమాన్విత శివరాత్రి రోజు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు జనం ప్రయాగ్ రాజ్ వైపు బారులు తీరుతున్నారు. దేశ విదేశాల నుంచి ప్రయగ్ రాజ్ తరలి వస్తున్నారు.
ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కూడా చాలా మంది భక్తులు మహా కుంభమేళాకు వెళ్లేందుకు విమానం టికెట్లు బుక్ చేసుకున్నారు. వారణాసి ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడనుంచి ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ప్రయాణికులు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ చివరి నిముషంలో ప్యాసింజర్లకు పాక్ ఇచ్చింది. ప్రయాణీకులందరూ బోర్డింగ్ పాస్ తీసుకొని ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లిన తర్వాత విమానం అలస్యం అవుతుందంటూ చివరి నిముషంలో ప్రకటించింది.
ఉదయం పది గంటలకు రావాల్సిన విమానం నాలుగు గంటలు దాటినా రాక పోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలోనే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దాదాపు విమానంలో టికెట్ బుక్ చేసుకున్న వాళ్లందరూ కుంభమేళాకు వెళ్లాల్సిన వాళ్లేనని, చివరి రోజు కావడంతో పుణ్య ఘడియలు వెళ్లిపోయే లోగా పవిత్ర స్నానాలు ఆచరిస్తామా, లేదో అన్న సండేహాలు కలిగించారంటూ ఎయిర్ పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయినా, సిబ్బంది సరైన సమాధానం చెప్పలేనంటూ ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కుంభమేళా డిమాండ్ కారణంగా రూ. 48వేలు పెట్టి విమానం టికెట్ బుక్ చేసుకున్నామని, తమకు సరైన సమాధానం చెప్పేవాళ్లు కరువయ్యారని, కనీసం విమానం ఎప్పటికి వస్తుందో కూడా చెప్పటికి పోతున్నారని మండిపడుతున్నారు..
అతి పవిత్రమైన మహా కుంభమేళా ఘడియలు వెళ్లిపోకముందే ప్రయాగ్ రాజ్లో తమకు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం దక్కేలా స్పైస్ జెట్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.