రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక పెను సంచలనమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి వ్యవస్థాకులు ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. అనంతరం జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. టీడీపీని లేకుండా చేస్తామని విర్రవీగినవారు కాలగర్భంలో కలిసిపోయారు. టీడీపీ స్థాపించిన ముహూర్తబలం, సంకల్పం చాలా గొప్పది. 43 సంవత్సరాలుగా పార్టీకి ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. సవాళ్లు అధిగమించామంటే అందుకు కార్యకర్తల అండదండలే కారణం. పార్టీయే ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తున్నామన్నారు చంద్రబాబు.
టీడీపీ స్థాపనతో బలహీన వర్గాలకు రాజకీయ అధికారం
అప్పుడే పార్టీ స్థాపించి 43 ఏళ్లు గడిచిపోయాయా అనిపిస్తోంది. టీడీపీ వచ్చాకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు రాజకీయ అధికారం వచ్చింది. ఒకప్పుడు బీసీలంటే లెక్కలేనితనం ఉండేది. రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. బీసీలంటే సమాజానికి వెన్నుముక అనే గుర్తింపు తెచ్చాం. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరింత పైకి తెస్తాం. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాము.
కార్యకర్తలే టీడీపీకి బలం…
ఆనాడు ఎన్టీఆర్ చైతన్యరథంతో వీధుల్లోకి వెళితే 9 నెలలు ఆయనకు అండగా రాత్రింబవళ్లు కార్యకర్తలు పనిచేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా 208 రోజులు, 2,817 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేస్తే నాకు అండగా నిలబడ్డారు. యువగళం పేరుతో నారా లోకేష్ 226 రోజులు, 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2024లో అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి కార్యకర్తలు నీరాజనం పలికారు.
హామీలు అన్నీ అమలు చేస్తాం…
ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చాం… ఆ రోజు బయట నుంచి చూస్తే అన్నీ చేయగలుగుతామనిపించిందని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలని, వచ్చే ఆదాయంతోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు.