ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయించిన డిప్యూటీ సీఎం

0
121

– విద్యుత్ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు
– హిమాచల్ ప్రదేశ్‌లో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి
– Boot (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్‌) విధానం
– ప్రతిపాదనలు ఆహ్వానించిన హిమాచల్ ప్రభుత్వం
– ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయించిన డిప్యూటీ సీఎం
– ఎంఓయూ పంపాల్సిందిగా హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంను కోరిన భట్టి విక్రమార్క

రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్(బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా.. తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికార బృందం హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించింది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసి త్వరితగతిన పంపితే తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇందుకు సంబంధించి గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ వింధర్ సింగ్ సఖుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం BOOT విధానంలో 22 హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలను ఆహ్వానించిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖకు చెందిన అధికారుల బృందం హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా, వారు హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శితో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే, 400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సెలి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 120 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మియార్‌ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించారు. తమ అధ్యయనంలో.. 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేయాలని విద్యుత్‌ శాఖ నిపుణులు సిఫారసు చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ వింధర్ సింగ్ తో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో, తెలంగాణ ప్రభుత్వం సెలి, మియార్‌ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ అధికారికంగా ఒక లేఖను సమర్పించింది.

ఈ సందర్భంగా ఎంఓయూ ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ సీఎంను కోరారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసిన అనంతరం త్వరితగతిన ఎంఓయూపై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయబడుతుంది. ఫలితంగా ప్రస్తుత రాష్ట్ర అవసరాలు, అలాగే.. భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు విద్యుత్ సరఫరా సామర్థ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here