లోక్సభలో ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ధ్వజమెత్తారు. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్ డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు మాత్రమే దక్కాయన్నారు. కేంద్ర జిడిపిలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆమేరకు నిధులు విదల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయన్న శ్రీధర్బాబు.. గతంలో కంటే 12 శాతం పెరిగినా రాష్ట్రంపై చిన్నచూపు చూడటానికి రాజకీయ కారణాలే కారణమని అభిప్రాయపడ్డారు. బిజెపికి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. బిహార్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్ లకు మాత్రమే ఫ్రాధాన్యత ఇవ్వడం కక్ష సాధింపు కాదా? అని మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క పలుసార్లు ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి రూ.1.63 వేల కోట్ల సహాయం కోసం అర్థించారని ఆయన గుర్తు చేశారు. మెట్రో-2 ప్రాజెక్టు 76.4 కిలోమీటర్ల విస్తరణకు కేంద్రం వాటాగా రూ.17.212 కోట్లు కేటాయించాలని కోరితే.. రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, శివారు మున్సిపాలిటీలకు CSMP కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్నా అన్యాయం చేసారని విమర్శించారు. మూసీ నది హైదరాబాద్ లో 55 కిలో మీటర్లు ప్రవహిస్తుండగా.. మురుగు కూపంగా మారిన ఈ నది పునరుజ్జీవం కోసం రూ.4 వేల కోట్లు అడిగితే కేంద్రం నిరాశ పర్చిందన్నారు. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే భారత్ రాష్ట్రాల సముదాయం. బీజేపీ దృష్టిలో మాత్రం దేశమంటే ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు. సమాఖ్య స్ఫూర్తిని విస్మరిస్తూ.. ప్రతి బడ్జెట్లోనూ ఇదే ధోరణిని అవలంభిస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఈసారి బిహార్పై వరాల జల్లు కురిపించారని, పెద్దన్నలా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన నైతిక బాధ్యతను విస్మరించి.. కొన్ని రాష్ట్రాలపైనే ప్రేమను చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తలసరి ఆదాయం, వృద్ధిలో దూసుకపోతున్న తెలంగాణకు మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, నవోదయ, సైనిక్ స్కూల్స్ ను కేటాయించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరినా రూపాయి ఇవ్వలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరినా విస్మరించారన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఊసు ఈసారి కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదన్నారు. గిరిజన యూనివర్సిటీకి మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరి-మూసీ అనుసంధానం ప్రస్తావనే లేదని, MGNREGA పథకం అమలులో కూడా వెసులు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు.. కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తారు.