ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో జరగనున్న ఈ క్యాబినేట్ భేటీలో ప్రధానంగా త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరగనుంది. దీనితో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన బీసీ కుల గణనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాదించడం కోసం అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించే అంశపై కూడా క్యాబినేట్ చర్చించనుంది. అలాగే మెప్మాను సెర్ప్లో విలీనం చేసే అశంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా తదితర అంశాలపై ఈరోజు జరగబోయే క్యాబినేట్లో నిర్ణయం తుది తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు వేసవి కాలం ఎండలు తీవ్రంగా ఉండటంతో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడటంతో పాటు తాగు నీటి ఎద్దడి రాకుండా తగు చర్యలు తీసుకునే విధంగా మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోనున్నారు.