తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 1 కోటి (1,00,52,598) దాటడం ఎంతో గర్వకారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదులో ఇదో గొప్ప రికార్డు అన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అసాధారణమైన ఈ లక్ష్యాన్ని చేరుకున్న వేళ, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ మహా క్రతువులో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, నాయకుడికి అభినందనలు తెలిపారు. కార్యకర్తల కష్టమే ఈ ఫలితమని, కోటి మంది పసుపు సైన్యంతో పార్టీని తీర్చిదిద్దిన కార్యకర్తే పార్టీకి అధినేత అని అభివర్ణించారు.
కార్యకర్తల పార్టీగా దినదిన ప్రవర్థమానమై తెలుగుదేశం వర్థిల్లుతోందని, ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నారా లోకేష్ ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు దేశాన్ని బలపరచడం అంటే రాష్ట్రాన్ని బలపరచడమేనని, కార్యకర్తల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మరింతగా శ్రమించి పార్టీని, రాష్ట్రాన్ని సమున్నత స్థానంలో నిలిపేందుకు అనుక్షణం ప్రయత్నిస్తామని ఈ సంతోష సమయంలో అందరికీ మాట ఇస్తున్నానని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.