- 2051 తర్వాత విశాలమైన రహదారులే ఉంటాయి..
- మనుషులు మాత్రం ఉండరు
- ఒక జంటకు ఇద్దరు పిల్లలుంటే ప్రోత్సాహకాలు
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేసారు. ఈ మధ్య ఏదొక సెన్సెషన్ చేస్తున్నారు.
అదేమిటంటే.. పిల్లల్ని ఎక్కువగా కనండి. లేదంటే రాబోవు రోజుల్లో ప్రమాదమని హెచ్చరించారు. ఏమిటా ప్రమాదమంటే.. అందుకెన్నో సహేతుకమైన కారణాలు చెప్పారు. మరెన్నో వాస్తవాలు వివరించారు. చెప్పినట్టు పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. అన్నింటికీ మించి ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తామని అన్నారు. ఇంతకీ జనాభాపై చంద్రబాబు చెప్పిన ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే.. జనాభా ఒకప్పుడు భారం..ఇప్పుడు ఆస్తి…అని అన్నారు.
2026లో ఏపీ జనాభా 5.38 కోట్లు ఉంటే.. 2031లో 5.42కోట్లు అవుతుంది.. ఇక 2036లో 5.44 కోట్లు ఉంటే.. 2041 నుంచి డౌన్ ఫాల్ నడుస్తుందని తెలిపారు. అప్పుడు మళ్ళీ 5.42 కోట్లకు చేరుతుందని అన్నారు. 2051 నాటికి జనాభా ఎదుగుదల ఆగిపోతుందని అన్నారు. ఆ పదేళ్లలో కేవలం కోటి మంది మాత్రమే జన్మిస్తారని సంచలన ప్రకటన చేశారు. అప్పుడు మనం నిర్మించుకున్న పెద్ద పెద్ద రోడ్లు, విమానాశ్రాయాలే ఉంటాయి గాని, అందులో తిరగడానికి మనుషులు మాత్రం ఉండరని అన్నారు.
ఇది దేశానికి, రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదని, క్షేమదాయకం కాదని అన్నారు. ఒక జంటకు ఇద్దరు పిల్లలు జన్మిస్తేనే… జనాభా రేటు స్థిరంగా ఉంటుంది. రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధి, సమాజాభివృద్ధి బాగుంటుందని వివరించారు. చివరిగా సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రజలు మమ్మల్ని, మా మేనిఫెస్టోని నమ్మి ఓటేశారు. అవి నెరవేర్చుతామని అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ కచ్చితంగా పాటించి తీరుతామని అన్నారు.
సోషల్ మీడియాపై నియంత్రణ సాధించామని, ఏదైనా ఆరోగ్యకరంగా ఉండాలని, హద్దులు మీరితే చర్యలు తప్పవని అన్నారు. మొత్తానికి చంద్రబాబు మాటలతో నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.