ఐటి పరిశ్రమలో హైదరాబాద్ దూసుకుపోతోంది. దీంతో అద్దెలు ఊహకు అందనంత స్థాయిలో ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో ఓ కార్యాలయ స్థలాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లీజుకు తీసుకుంది. నానక్రామ్గూడ రాజపుష్ప పారడిగ్మ్లో 10 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని టీసీఎస్ 15 సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకుంది. ఆఫీస్ స్పేస్ నెలవారీ అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ స్థలం కోసం టీసీఎస్ నెలకు రూ. 4.37 కోట్ల అద్దె చెల్లించనుంది. అడ్వాన్సు కింద ఆరు నెలల అద్దెకు సమానమైన రూ. 26.2 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్గా ముందే చెల్లించింది. మెుత్తం ఏడాది కాలానికి 52.44 కోట్లు అద్దె రూపంలో చెల్లించనుంది.
రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం.. ప్రతి ఏడాది 12 శాతం చొప్పున అద్దె పెరుగుదల ఉంటుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప గ్రూప్ అభివృద్ధి చేసిన రాజపుష్ప పారడిగ్మ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున కమర్షియల్ బిల్డింగ్ నిర్మించింది. 2022లో నిర్మాణం పూర్తయిన ఈ భవనంలో 19 అంతస్తులు ఉన్నాయి. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కోర్ట్, గ్రీనరీ, జిమ్, ఏటీఎం వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించారు.
ఈ భవనం సమీపంలోనే విప్రో, ఐసీఐసీఐ, బ్రాడ్రిడ్జ్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కూడా ఉన్నాయి. దీంతో ఈ భవనాన్ని భారీ ఎత్తున అద్దె చెల్లించి టీసీఎస్ కంపెనీ లీజుకు తీసుకుంది. ప్రస్తుతం ఈ లీజు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెలవారీ అద్దె అన్ని కోట్లా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు ఒకదానికొకటి పోటీ పడుతూ నగర బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతున్నాయి. నగరంలో ఐటీ రంగం విస్తరిస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా డిమాండ్ పెరుగుతోంది.