కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని ప్రతివాదులకు హితవు
ఫిరాయింపు ప్రజాప్రతినిధుల వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయింపులు నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉంది. మరి పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోతే పదో షెడ్యూల్ని అపహాస్యం చేయడం కిందకే వస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుల ఫిరాయింపులపై బీఆర్ఎస్ వేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ కొనసాగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు వింటోంది. బీఆర్ఎస్ తరపున న్యాయవాది ఆర్యమా సుందరం తన వాదనలు వినిపించారు. ఫిరాయింపు శాసనసభ్యులపై మొదటి సారిగా 2024 మార్చి 18న శాసనసభ స్పీకర్ కి ఫిర్యాదు చేశామని లాయర్ ఆర్యమా ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళారు. అయితే ఆ ఫిర్యాదుకు స్పందించి ఎవరకీ నోటీసులు ఇవ్వలేదని, హైకోర్టుకు వెళ్ళేంత వరకూ కూడా నోటీసులు ఇవ్వలేదని ధర్మాసనానికి తెలిపారు. దానం నాగేందర్ పై ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదు. పైపెచ్చు ఆయన కాంగ్రెస్ పార్టీ నంచి ఎంపీగా పోటీ చేసినా చర్యలు తీసుకోలేదని ధర్మాసనానికి బీఆర్ఎస్ న్యాయవాది తెలిపారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ శాసనసభ్యులు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారని తెలిపారు. నోటీసులు ఇచ్చామని స్పీకర్ చెపుతున్నా ఆ కాపీలు ఏవీ మాకు అందలేదని, స్పీకర్ ఏమీ న్యాయ సమీక్షకు అతీతులు కారని, ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్ధిష్టమైన గడువు విధించాలని బీఆఎస్ తరపు న్యాయవాది ఆర్యమా సుదరం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని, ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్ళగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ఇదిలా ఉండగా తమకు కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని ప్రతివాదుల తరపున న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే విధానాలు మనుకోవాలని ప్రతివాదులకు హితవు పలికింది.