ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ బెంచ్ ఎదుట స్పీకర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇంతవరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి తెలిపారు. మణిపూర్ అంశం ప్రత్యేకమైనదని, దాన్ని ప్రస్తుత కేసుతో పోల్చరాదని పేర్కొన్నారు.
అయితే, జస్టిస్ బీఆర్ గవాయ్.. రాణా కేసును ప్రస్తావిస్తూ, అక్కడ కోర్టు జోక్యం చేసుకొని అనర్హత విధించిందని గుర్తు చేశారు. “మీ అభిప్రాయం ప్రకారం ‘రీజనబుల్ టైమ్’ అంటే ఏంటి?” అని సింఘ్విని గవాయ్ ప్రశ్నించారు. న్యాయవాదుల తీరు సుప్రీంకోర్టుకు వచ్చిన తరువాత పూర్తిగా మారిపోతుందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా, కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. “అసెంబ్లీలో మాట్లాడితే కోర్టు నుంచి రక్షణ లభిస్తుందని భావించారా?” అని న్యాయవాది సుందరం ప్రస్తావించారు. ప్రతిపక్షం నేతలు అంతకు మించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని సింఘ్వి న్యాయమూర్తి దృష్టికి తీసుకు రాగా.. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని పక్కన ధర్మాసనం పక్కనపెట్టింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు తీసుకోవాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు. తాము సంయమనం పాటిస్తున్నామని.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.
స్పీకర్కు ఫిర్యాదు చేస్తే కోర్టు కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని స్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది పేర్కొనగా.. “సింగిల్ జడ్జి సూచనలు పాటించి ఉంటే, ఈ కేసు ఇంత దూరం వచ్చేది కాదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతోనే నోటీసులు జారీ అయ్యాయి,” అని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన వ్యవహారంపై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధ, గురువారాల్లో విచారణ జరిగింది. దీనిపై తుది తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.