ఏడుగురు జడ్జ్లకు స్థానచలనం
సుప్రీంకోర్టు కొలీజియం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం ఏడుగురు హైకోర్టు జడ్జ్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన వారిలో ఇందులో కర్ణాటక హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు, ఏపీకి చెందిన ఒక హైకోర్టు జడ్జ్ ఉన్నారు. ఏప్రిల్ 15 నుంచి 19 వరకు జరిగిన కొలీజియం సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైకోర్టుల్లో సమగ్రత, వైవిధ్యాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది కొలీజియం. అందుకే ఏడుగురు హైకోర్టు జడ్జ్లను బదిలీ చేస్తున్నట్టు తెలిపింది. ఈ కొలీజియంలో సీజేఐ సంజీవ్ ఖన్నాతో పాటు.. సీనియర్ జడ్జ్లు జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ హేమంత్ చందనగౌడర్, జస్టిస్ సంజయ్ గౌడ, జస్టిస్ కె.నటరాజన్లను బదిలీ చేయాలని సిఫారసు చేశారు. తెలంగాణ హైకోర్టు జడ్జ్ జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ కె.సురేందర్, ఏపీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె.మన్మథరావులను బదిలీ చేయాలని సిఫారసు చేసింది.
ఒడిశా హైకోర్టుకు జస్టిస్ దీక్షిత్ కృష్ణా శ్రీపాద, మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ చందన్ గౌడర్, కేరళ హైకోర్టుకు జస్టిస్ నటరాజన్, జస్టిస్ సంజయ్ గౌడను గుజరాత్ హైకోర్టులకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ సురేందర్ను మద్రాసు హైకోర్టుకు మార్చాలని సిఫారసు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేశారు.