దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు 17 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన విజయయాత్ర శనివారంతో ముగిసింది. అక్టోబర్ 17వ తేదీన శృంగేరిలో ప్రారంభించిన విజయయాత్ర నవంబర్ 30వ తేదీన రాజమహేంద్రవరంతో దిగ్విజయంగా పూర్తయ్యింది. తొలుత కర్నాటకలోని హసన్, తూమ్కూర్, బెంగళూరు అర్బన్, కోలార్, దొడ్డబళ్ళాపూర్, చిక్ బళ్లాపూర్ జిల్లాల్లో పది రోజుల పాటు విజయయాత్ర జరిపిన విధుశేఖర భారతీ స్వామివారు అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలో అడుగుపెట్టారు. 17 రోజుల పాటు తమిళనాడులో నిర్వహించిన జగద్గురువుల విజయయాత్ర నవంబర్ 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విజయాత్రను కొనసాగించారు.
అనేక చోట్ల దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల వద్దకు వెళ్ళి అనుగ్రహభాషణం చేశారు. అక్టోబర్ 26వ తేదీ కోనసీమ జిల్లాను సందర్శించినప్పుడు కొత్తపేట మండలం వానపల్లి గ్రామం సందర్శించి గ్రామదేవత పళ్ళాలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదే గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీదేవీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరసామి దేవస్ధానాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. అదే రోజు సాయంత్రం శ్రీవేద విజ్ఞాన బ్రాహ్మణ సేవా సంఘం వారు పూజ్య విధుశేఖర భారతి స్వామివారికి గురువందనం నిర్వహించారు. ఈ సందర్భంగా అశేషంగా విచ్చేసిన భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. 45 రోజుల పాటు మూడు రాష్ట్రాల్లో అప్రతిహతంగా సాగిన జగద్గురువుల విజయయాత్ర నవంబర్ 30వ తేదీన రాజమహేంద్రవరంలో ముగిసింది. అదేరోజు ఉదయం స్వామివారు శృంగేరి తరలివెళ్ళారు.