33.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఏపీలో మిర్చి ఘాటు ఫ్లేవర్‌ – హాట్‌ హాట్‌ పాలిటిక్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలతోపాటు రాజకీయాలు కూడా వేడెక్కాయి. అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్న ప్రభుత్వానికి.. జనంలో ఉంటూనే జగన్ మోహన్ రెడ్డి బదులిస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు. అటు నుంచి అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. మరోవైపు.. షర్మిల ఇద్దరిపై విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మిర్చి మసాలాగా మారింది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పీడ్ పెంచినట్టు కనిపిస్తున్నారు. మంగళవారం జైల్లో వంశీని పరామర్శించారు. బుధవారం గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో రైతులు సంతోషంగా లేరని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి న్యాయం జరగడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ధ్వజమెత్తారు. వైయస్‌‌ఆర్‌సీపీ హయాంలో రైతులకోసం ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కనపడకుండా పోయాయి. గ్రామాల్లో ఆర్‌బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మా ప్రభుత్వ హయాంలో ఇతర పంట కొనుగోళ్లకు రూ.7,000 కోట్లు ఖర్చు చేసి ప్రతి రైతునూ ఆదుకున్నామని. నేడు కల్తీ విత్తనాలు, ఎరువులు బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఉందని, కొత్తప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం రావడం లేదని, సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేకపోయారని జగన్ మండిపడ్డారు. కల్తీ విత్తనాలు సరఫరా ప్రభుత్వమే చేస్తోందని ఆరోపించారు. మిర్చి రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రైతులకు అండగా వైసీపీ పోరుబాట పడుతుందన్నారు జగన్.

తన పర్యటన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన జగన్ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో మొన్నటి వరకు ధాన్యం రైతులు ఇబ్బంది పడ్డారని ఇప్పుడు మిర్చి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి రైతులను పట్టి పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో క్వింటా ధర రూ.21 వేలు నుంచి రూ.27 వేలు దాకా పలికిందని ఇప్పుడు రూ.8వేల నుంచి రూ.11వేలకు పడిపోయిందన్నారు. ఈ ఏడాది తెగుళ్లు కారణంగా మిర్చి పంట దిగుబడి పడిపోయిందని ఎకరాకు పది క్వింటాళ్లకు మించి రాలేదన్నారు. కౌలు రైతు పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లా రైతులు మరిన్ని ఇబ్బందు పడతున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. దీనిపై రివ్యూ కూడా చేయలేదన్నారు. రైతులకు సాయం చేయకపోగా తాము తీసుకొచ్చిన విప్లవాత్మక పథకాలు కూడా మూల పడేశారని ధ్వజమెత్తారు.

మరోవైపు.. జగన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు కనీసం అడుగు బయట పెట్టని వ్యక్తి.. ఇప్పుడు ఏదో రాజకీయం చేయడానికి బయటకు వస్తున్నారని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ చెప్పే అబద్దాలు విన్న ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు పని లేకపోవడంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. వ్యవసాయం కోసం జగన్ చేసిందేంటని ప్రశ్నించారు. దీనికి తోడు భారీగా బకాయిలు పెట్టి వెళ్లిపోయారని మండిపడ్డారు.

ఈ ఇద్దరికీ ప్రజల పట్ల చిత్త శుద్ధి లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఎన్నికల హామీలు అమలు చేసి ప్రజలను ఆదుకోవడం తెలియడం లేదని ఆక్షేపించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా జగన్‌కు లేదని మండిపడ్డారు. దీంతో, ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్‌ మిర్చి ఘాటు ఫ్లేవర్‌తో హాట్‌ హాట్‌గా మారాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com