- బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో భారీ కేటాయింపులు
- రాష్ట్రానికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు
- మిథిలాంచల్ లో రేపు కొత్త రేవు ప్రారంభం
- మఖానా పంటకు ప్రత్యేక బోర్డు
- మఖానా సాగు రైతులకు స్కీములు
- పాట్నా ఐఐటి సమర్ధత పెంపు
- ఢిల్లీలో 20 లక్షల మంది బీహారీ ఓటర్లు
ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా బీహార్ కు భారీ కేటాయింపులు జరిపి తద్వారా మర నాలుగు రోజుల్లో ఉన్న ఢిల్లీ ఎన్నికల్లో బీహారీ ఓటర్ల మనసు దోచే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం 2025-2026 బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈసారి బీహార్ కు భారీ కేటాయింపులు ఉన్నాయి. పౌరవిమాన యాన సేవలను మరింత విస్తరించే దిశగా వచ్చే ఏడాది ఎన్నికలున్న బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రేపు మిథిలాంచల్ లో కొత్త రేవును ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. బీహార్ లో సూపర్ ఫుడ్ గా సాగు అవుతున్న మఖానా పంట కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే మఖానా సాగు రైతులకు కేంద్రం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి. ఈ చర్య వల్ల ఉత్తర బీహార్ లో మెజారిటీ రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక మంత్రి ఈ ప్రకటన చేసిన వెంటనే ట్రజరీ బెంచ్ సభ్యుల నించి పెద్ద పెట్టున హర్ష ధ్వానాలు వ్యక్తమయ్యాయి.అలాగే విద్యారంగంలో ఐఐటీలకు మరింత ప్రోత్సాహకాలిస్తున్న కేంద్రం పాట్నాలోని ఐఐటీ సంస్థ సమర్ధతను పెంచుతామని ప్రకటించారు.
బీహార్ కి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఢిల్లీ, బీహార్ ఓటర్లకు ఎర వేసేందుకు కేంద్రం కామన్ గా వేసిన అస్త్రమిది. ఎందుకంటే ఢిల్లీలో 20 లక్షల మంది బీహారీలు ఉన్నారు. వారందరినీ ప్రసన్నం చేసుకోడానికి, అదే విధంగా రాష్ట్రంలో ఈసారి అధికారం సాధించడానికి బీజేపి ఈ వరాల జల్లు కురిపించింది. అధికారంలో ఉన్న జేడీయూ నేత నితీష్ కుమార్ వార్ధక్యం కారణంగానూ, పాలనపై దృష్టి పెట్టలేకపోవడం వల్ల జేడీయూ ప్రభ బీహార్ లో మసక బారింది. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపి ఈసారి అక్కడ అధికారం దక్కించుకోడానికి పకడ్బందీ ప్రణాళికలతో అడుగులేస్తోంది. అసలే కేంద్రంలో ఇప్పుడు ఎన్డీ ఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ సంకీర్ణ కూటమికి 12 మంది ఎంపీల జేడీయూ మద్దతు కీలకంగా ఉంది. అందుకే భాగస్వామ్య పరంగా కూడా నితీష్ పార్టీకి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన బీజేపి బడ్జెట్ లో ఈ భారీ ఊరడింపులు కల్పించిందనుకోవాలి.
జేడీయూ కలా… టీడీపీకిలా…
ఎన్డీ ఏలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ నేతృత్వంలోని బీహార్ కు ఇంత ప్రయారిటీ ఇచ్చిన కేంద్రం అదే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అధికారంలో ఉన్న ఏపీకి మాత్రం ఏ భారీ కేటాయింపులు చేయలేదు. ఇది బీజేపి మార్క్ రాజకీయమని కాంగ్రెస్ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు ఈ బడ్జెట్ లో ఏ భారీ కేటాయింపు కానీ, ఊరడింపు కానీ నిర్మల బడ్జెట్ స్పీచ్ లో వ్యక్తం కాలేదు.