భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కలియుగ వైకుంఠంగా భావించే ఈ పవిత్ర క్షేత్రంలో పోలీసు శాఖ అణువును పర్యవేక్షిస్తూ నిఘాను బలోపేతం చేసింది. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో పాటు డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. తిరుమల డీఎస్పీ విజయ్ శేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆక్టోపస్, విజిలెన్స్, పోలీసు విభాగాలతో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి మొత్తం 138 మంది సిబ్బందితో తనిఖీలు జరుగుతున్నాయి. అలిపిరి వద్ద భక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తున్నారు. తిరుపతి విమానాశ్రయంలోనూ హై అలర్ట్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల భద్రతపై కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విమానాశ్రయ అధికారులతో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల లగేజీ, అనుమానిత వస్తువులను డాగ్ స్క్వాడ్ సాయంతో పరీక్షించి భద్రతా సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. శుక్రవారం తిరుమలలో జరిగిన ఏరియా డామినేషన్ కార్యక్రమంలో 130 మంది పోలీసు, ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, నిఘా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ బృందాలు నాలుగు భాగాలుగా విడిపోయి శ్రీవారి ఆలయం, బస్టాండ్, కాటేజీలు, నందకం పరిసరాలు, ఎంబిసి, శ్రీవారి మెట్టు వంటి ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించాయి. భక్తుల్లో భరోసా కలిగిస్తూ, దుండగులకు హెచ్చరికగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
- Advertisement with us -