- ఉప ఎన్నికలు వస్తే దానంకి సీటు ఇవ్వద్దని ఫ్లెక్సీలు
- రాజుయాదవ్ పేరుతో కేబీఆర్ పార్క్ చౌరస్తాలో వెలసిన ఫ్లెక్సీ
ఖైరతాబాద్ కాంగ్రెస్ లో రచ్చ ప్రారంభమయ్యింది. సిట్టింగ్ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ కు అసంతృప్తి సెగ తగులుకుంది. ఆలూ లేదు చూలూ లేదు కొడు పేరు సోమలింగం అన్నట్లు ఫిరాయింపుల చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ్యత్వం రద్దైతే… జరగబోయే ఉప ఎన్నికల్లో దానంకు టిక్కెట్ ఇవ్వవద్దని ఆయన స్ధానంలో కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న రాజుయాదవ్ కు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు నియోజకవర్గంలోని ప్రధాన కూడలి అయిన కేబీఆర్ పార్క్ చౌరస్తాలో పెద్ద ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన దానం నాగేందర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో విచారణ తుది దశకు చేరుకుంటున్న సందర్భంలో నగరంలో రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు ప్రారంభం అయ్యాయి. ఫిరాయింపుదారులపై వేటు పడితే ఖైరతాబాద్ నియోజకవర్గం నంచి 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కష్టకాలంలో కాంగ్రెస్ ను నియోజకవర్గంలో బలపరిచిన నాయకుడు రాజు యాదవ్ కి అవకాశం ఇవ్వాలని వీవీఐపీలు సంచరించే కేబీఆర్ పార్కు చౌరస్తాలో ఫ్లెక్సీ వెలిసింది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ నియోజకవర్గంలో రాజీకాయాన్ని వేడెక్కించడమే కాకుండా కాంగ్రెస్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
అయితే తన నియోజకవర్గంలో మరో నాయకుడికి టికెట్ ఇవ్వాలంటూ వెలసిన ఫ్లెక్సీ పై దానం మండిపడ్డట్టు సమాచారం. ఫ్లెక్సీ వ్యవహారంలో నాయకుడు గుస్సా అయ్యాడని తెలిసిన వెంటనే దానం అనుచరులు రంగంలోకి దిగిపోయారు. సాయంత్రానికల్లా ఫ్లెక్సీ ని చించి వేయడంతో ఫ్లెక్సీ వివాదం నగరమంతా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై రాజు యాదవ్ స్సందిస్తూ తన అభిమానులు పెట్టి ఉండవచ్చునని తనకు ఎలాంటి సమాచారం కూడా లేదని చెప్పడం కొసమెరుపు. కానీ ఫ్లెక్సీలు చించడం దానం గుండా గురీకి నిదర్శనం అంటూ అనుచరుల వద్ద వాపోయినట్లు తెలిసింది. నియోజకవర్గాన్ని తన కబంధహస్తాల్లో ఉంచుకుంటూ ఇతరులను అన్ని రకాలుగా వేధించడం దానంకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మనం కూడా సీరియస్ గానే తీసుకున్నాం ఈసారి దానం ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తన అనుచరులతో అన్నట్లు సమాచారం.