తెలుగు ప్రేక్షకులకు సినీ నటులపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో కనిపించే వారిని దేవుళ్లలా పూజించే స్థాయికి వెళ్ళిపోయే అభిమానం మనకు సుపరిచితమే. దానికి మరో ఉదాహరణగా నిలిచింది ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సమంత కోసం కట్టిన గుడి. తమిళనాడులో ఖుష్బూ, జయలలిత, హన్సిక లాంటి హీరోయిన్లకు ఆలయాలు నిర్మించినట్లే, 2023లో బాపట్లలో ఓ వీరాభిమాని సమంత కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించాడు. అప్పట్లో ఆమె విగ్రహం కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు సమంత పుట్టినరోజు సందర్భంగా, అక్కడ గోల్డెన్ కలర్లో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, సమంత జన్మదినాన్ని ఘనంగా జరిపారు. పూజ అనంతరం కేక్ కట్ చేసి, పలువురు అనాథ పిల్లలకు భోజనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అభిమానం మరో స్థాయికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ గుడిని ఎందుకు కట్టారని అడిగినప్పుడు, సమంత చేసిన ఛారిటీ కార్యక్రమాలపై తనకున్న గౌరవం వల్లే ఇలా చేశానని ఆ అభిమాని చెప్పడం విశేషం. వాస్తవానికి గతంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంది. గత ఏడాది ఆమె నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ పెద్దగా విజయం సాధించకపోయినా, ఇప్పుడు నిర్మాతగా మారి ‘శుభం’ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసింది.