- 11 మంది మంత్రుల తొలగింపు.. భగ్గుమంటున్న నేతలు
- అలకలు.. బుజ్జగింపులు.. ఫడ్నవిస్ కు కొత్త తలనొప్పులు
పట్టుమని నెల్లాళ్లయినా కాకుండానే మహారాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు బయల్దేరాయి. దాదాపు 11 మంది మంత్రులను కేబినెట్ నుంచి తొలగించడం వివాదాస్పదమవుతోంది. వారిని వేర్వేరు కారణాలతో తొలగించినప్పటికీ….ప్రభుత్వం పూర్తిగా ఏర్పడకుండానే తొలగింపులేంటని మంత్రుల్లో అసంత్రుప్తి రేగుతోంది. తొలగించిన మంత్రుల్లో అజిత్ పవార్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన వారు ఐదుగురు ఉండగా, బీజేపి, శివసేన ముగ్గురేసి మంత్రులకు ఉద్వాసన చెప్పాయి.మహాయుతి కూటమి హటాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల తొలగింపుకు గురైన మంత్రులు మండిపడుతున్నారు. నేషనలిస్టు పార్టీకి చెందిన ఛగన్ బుజ్బల్ అసెంబ్లీ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టి సొంత నియోజక వర్గం యోలా కు వెళ్లి పోయారు. వాస్తవానికి తనకు రాజ్యసభ ఇస్తామని వాగ్దానం చేశారని, కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇప్పుడా పదవి తీసుకోవడం కూడా దండగ అని పిస్తోందని అన్నారు. మంత్రుల తొలగింపుపై ఫడ్నవిస్ను వివరణ కోరగా.. ఒక చోట తొలగిస్తే అది పూర్తిగా తీసివేయడం కాదని, అవసరమైన మరో చోట వారికి మరో రూపంలో పదవులు ఇస్తామనీ అన్నారు. శివసేనకు చెందిన మరో నేత మంత్రి పదవి ల కేటాయింపుల్లో తేడాలకు విసిగి పార్టీ పదవికే గుడ్ బై కొట్టారు. పదవులు ముఖ్యం కాదని , పార్టీ తమకు ఇస్తున్న గౌరవం, మర్యాద కీలకమైనవని వ్యతిరేకిస్తున్నఎమ్మెల్యేలు అంటున్నారు. మహాయుతిలో భాగస్వాములైన శివసేన, నేషనలిస్ట్ పార్టీ లకు అనుకున్న ఫార్ములాలో కేటాయింపులు జరిగినా.. చివరి నిమిషంలో మళ్లీ మార్పులు చేర్పులు చేపట్టడంతో కొత్తగా ఎంపికైన మంత్రులు కొందరు తొలగింపుకు గురవ్వాల్సి వచ్చింది. దాంతో అసంత్రుప్తి జ్వాలలు భగ్గుమన్నాయి.