పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పటేల్, ప్రధాన కార్యదర్శి షిండే తదితరులు సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీయం భట్టి విక్రమార్కని కలసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాలి కులస్తులు ఎస్టీలుగా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీల జాబితాలో చేర్చడంతో అన్ని రంగాల్లో వెనుకబడిపోయామని వారు విజ్ఞప్తి చేశారు. 2008లో వైయస్సార్ సీఎం గా ఉన్నప్పుడు జ్యోతిబాపూలే జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించారని, ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చి ప్రజాపాలనను అందించడం శుభ పరిణామం అని తెలిపారు. మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలి కులస్తులకు టికెట్లు కేటాయించాలని, హైదరాబాదులో మాలి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని కోరారు. గత అనేక సంవత్సరాలుగా మాలి కులస్తులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తెలంగాణ యూనివర్సిటీకి సావిత్రి బాయి పూలే తెలంగాణ యూనివర్సిటీగా నామకరణం చేయాలని, ట్యాంక్ బండ్ పై పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. సావిత్రి బాయి పూలే జన్మదినమైన జనవరి 3ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం అని అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాలి కులస్తుల జాతీయ అధ్యక్షుడు విలాసరావు పాటిల్, సావిత్రి బాయ్ పూలే వంశీయులు డాక్టర్ దిలీప్ గణపతి పాటిల్ బృందం ఈసందర్భంగా డిప్యూటీ సీఎంను ఘనంగా సన్మానించారు.