మూసీ సుందరీకరణ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం ఎమ్మెల్సీ సత్యవతీ రాథోడ్ తో కలిసి మండలి మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణ కోసం తాము ప్రపంచ బ్యాంకును రుణం అడగలేదని శ్రీధర్ బాబు సభలో చెప్పింది అసత్యమని కవిత వెల్లడించారు. ఈ మేరకు ఆమె 2024 సెప్టెంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంకును రుణం అడిగిన పత్రాలను బయటపెట్టారు. మూసీ సుందరీకరణ డీపీఆర్ లేదని సభకు చెపుతారని కానీ సెప్టెంబర్ 19న ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉందని చెబుతారని… ఎందు కోసం అబద్దం చెపుతున్నారని, ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలోకి ప్రపంచ బ్యంకును అడుగుపెట్టనివ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరల్డ్ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తోందని కవిత అన్నారు. మూసీ పేరు తో పేదల ఇండ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోమని, ఈ విషయంలో స్పష్టత వచ్చేదాకా పోరాడుతామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.