తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా రోజుల తర్వాత మళ్లీ రియల్ ఎస్టేట్ కు సంబంధించి బూమ్ మొదలవుతోంది. గత ఏడాది కాలం నుంచి ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ జరగడంలేదని భూముల ధరలు బాగా తగ్గినట్టుగా ప్రచారం జరిగింది. కారణాలు ఏమైనా కొంత ఇంపాక్ట్ మాత్రం కనిపించింది. హైడ్రా ఏర్పాటు ప్రభావం అవునన్నా కాదన్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న రియల్ ఎస్టేట్ పై తీవ్రంగానే పడింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అక్రమ కట్టడాలపై చర్యలు తప్పదనే విషయాన్ని స్పష్టం చేసింది. మొన్నటి వరకు ఈ విషయంపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చలు జరిగినప్పటికీ. మారిన పరిస్థితుల్ని నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగానే కట్టడాలు చేపట్టాలనే నిర్ణయానికి చాలామంది వచ్చేసారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పలు ప్రాజెక్టులు ఇప్పుడు హైదరాబాద్లో భూముల ధరల పెరగడానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని ప్రకటించారు. ఇక్కడ డెవలప్మెంట్ కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. ఈ న్యూ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళికలను కూడా వేగవంతంగా రూపొందిస్తున్నారు. ఒకవైపు ఫ్యూచర్ సిటీ గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేయడం రియల్ ఎస్టేట్ పై మంచి ప్రభావం చూపింది. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మరో రెండు ఐటి పార్కులు రాబోతున్నట్లుగా స్వయంగా ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఐటీ సంస్థల పరిసర ప్రాంతాల్లో కాకుండా కొత్త ప్రాంతాల్లో రెండు వేరువేరు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. శ్రీధర్బాబు అలా ప్రకటన చేశారో లేదో ఐటీ పార్కులు తమ ప్రాంతాల్లో పెట్టమంటే తమ ప్రాంతంలో పెట్టమని కాంగ్రెస్ నాయకులు డిమాండ్లు మొదలు పెట్టారు. గడచిన సంవత్సర కాలంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఆయువు పట్టులాంటి హైదరబాద్ నగరంలో భూములు, నిర్మాణ రంగంలో లావాదేవీలు కొంత మందగించాయి. రియల్ వ్యాపారుల కార్యకలాపాలు లేక ఢీలా పడిపోయారు. ఇక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పై ఆధార పడ్డ లక్షలాది మందిఉద్యోగులు చేతికి పని దొరక్క నీరసించిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు నూతనంగా రెండు ఐటీ పార్కులు నిరమిస్తామని చేసిన ప్రకటన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, మార్కెటింగ్ సిబ్బందికి బ్రోకర్లకు నూతనోత్సాహం తీసుకువచ్చింది. మొత్తానికి తాజాగా జరుగుతున్న పరిణామాలు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ మరొకసారి పెరుగుతుందనే అభిప్రాయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు.