ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోనన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. మొదట ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడు గ్రామానికి వెళ్లిన భట్టి విక్రమార్క.. అక్కడ పర్యటన ముగిసిన తర్వాత తెల్లపాలెం గ్రామానికి చేరుకున్నారు. తెల్లపాలెం గ్రామంలో కనీవినీ ఎరుగని రీతిలో డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం లభించింది. భట్టివిక్రమార్కకు భాజా భజంత్రీలు, బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్ళు, మంగళ హారతులతో తెల్లపాలెం ప్రజలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆ తర్వాత చిన కండ్రిగ గ్రామం వెళ్లిన ఉపముఖ్యమంత్రికి గ్రామ శివారులోనే ఘన స్వాగతం లభించింది. ఆయనను ఎదురేగి స్వాగతం పలికిన ప్రజలు, కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు గ్రామ శివారు నుంచి చినకండ్రిగ గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ఆయనపై బంతిపూల వర్షం కురిపిస్తూ తీసుకెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భట్టి విక్రమార్కపై తమ అభిమానాన్ని చాటుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. కండ్రిగ గ్రామంలో 7 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం కండ్రిగలో గ్రామపంచాయతీ కార్యాలయం భవనాన్ని ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు.