- మూడు పార్టీలకు ముద్దుల బీసీనేత ఆర్. కృష్ణయ్య
- టీడీపీ టు బీజేపీ వయా వైఎస్సార్సీపీ
జగమెరిగిన బీసీ బాంధవుడు ఆర్.కృష్ణయ్య నక్కని తొక్కి రాజకీయాల్లోకి వచ్చి ఉంటారు. ఒక పార్టీ అని కాకుండా ఇప్పటి వరకూ మూడు రాజకీయ పార్టీలు ఆయన్ను నమ్మి రాజకీయంగా అందలం ఎక్కించాయి. ఆర్.కృష్ణయ్యకు పదవులు ఇస్తే రెండు రాష్ట్రాల యావత్ బలహీనవర్గాల ప్రజల్ని రిప్రజెంట్ చేసినట్లే అని భావించడం వల్ల కాబోలు ఆర్. కృష్ణయ్య వెంటపడి మరీ ఆయనకు చట్టసభల్లో పదవులు కట్టబెడుతున్నాయి రాజకీయ పార్టీలు. అయితే విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలు ఆర్. కృష్ణయ్యను నమ్మినంతగా ఆర్. కృష్ణయ్య ఆయా రాజకీయ పార్టీలను నమ్మకపోవడం. ఆర్. కృష్ణయ్యకు పదవి ఇస్తే బీసీలందరినీ తమవైపునకు తిప్పుకోవచ్చనే అపోహలో పార్టీలు ఏరికోరి మరీ ఆయనకు కిరీటం పెడుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత 2014 తెలంగాణలో టీడీపీ ముఖ్యమత్రి అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య ఫోకస్ చేసి తెలంగాణలో ఎన్నికలకు వెళ్లింది టీడీపీ. అదే టర్మ్ చివరలో వైఎస్ఆర్సీపీకి దగ్గరై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తలదూర్చారు ఆర్. కృష్ణయ్య. 2019 ఎన్నికలకు ముందు బీసీలకు నేను ఊహించినదానికంటే జగన్మోహనరెడ్డి ఎక్కువ చేస్తానని హామీ ఇచ్చారని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకీ చెప్పారు. ఆ తరువాత బీసీలందరినీ గౌరవించినట్లుగా భావించి తెలంగాణ వ్యక్తి అయినా పిలిచి మరీ ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ ఎంపీని చేశారు వైఎస్.జగన్. తీరా 2024లో వైసీపీ ఘోర పరాజయంతో తనను ఎంతగానో నమ్మి రాజ్యసభకు పంపిన జగన్మోహనరెడ్డికి దూరం జరిగి… తనను వైఎస్సాఆర్సీపీ విపరీతంగా వాడుకుందని జగన్ మీద బండలు వేసే ప్రయత్నం చేశారు. బీజేపీ ఉచ్చులో పడి వైఎస్సార్సీపీ ద్వారా తనకు సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్ళు ఉన్నా… రాజ్యసభకు ఉపఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార కూటమి సభ్యుల సంఖ్య 164 ఉండటంతో మళ్ళీ రాజ్యసభకు నామినేట్ అవ్వడం పెద్ద కష్టం కాదనే ఉద్దేశంతో పరాజయం పాలైన వైఎస్సార్సీపీని వీడి కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కైవశం చేసుకున్న ఎన్డీఏ పక్షాన చేరిపోయారు ఆర్.కృష్ణయ్య. తాజాగా బీజేపీ విడుదల చేసిన రాజ్యసభ అభ్యర్ధుల జాబితాలో మొదటి పేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.కృష్ణయ్యను ప్రకటించారు. బీజేపీ రాజ్యసభ అభ్యర్ధుల జాబితాలో ఆర్.కృష్ణయ్య కనిపించడంతో ఆయన రాజకీయ క్రీడ అందరికీ అర్ధమై ముక్కున వేలేసుకుంటున్నారు.